Lok Sabha Elections 2024: స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పాకులాడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. రెండు పార్టీలు తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.
మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. పదేళ్ల పదవీ కాలం తర్వాత ప్రజల ఆశీస్సు కోసం వచ్చానని తెలిపారు. దేశం కోసం తాను శ్రమిస్తున్న తీరును ప్రజలు చూశారని అన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవలందించడం తన ధర్మమని తెలిపారు. వచ్చే ఐదేళ్ల కోసం కాకుండా పాతికేళ్ల ప్రగతి కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం దేశంలో చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు హిందూ, ముస్లింల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని చెప్పారు. రాజకీయాలను కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకే కాకుండా..దేశ నిర్మాణానికి సాధనంగా చేసుకోవాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ కంచుకోట అయిన ఇటావాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం దౌరెహ్రాలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత అయోధ్యకు వెళ్లి రామ మందిరంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు.
Also Read: ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..? : ప్రియాంకా గాంధీ