తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన యువత ఆకాంక్షలను నెరవేరుస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. త్వరలోనే అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో నిరుద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను, ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యాల గురించి వివరించారు.
‘ఉపాధి హామీ కూలీ పనులు చేస్తూ, ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివించిన తల్లిదండ్రుల కల ఈరోజు నెరవేరింది’ అని ముఖ్యమంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం సర్వం ధారపోసిన తల్లిదండ్రులను ఉద్యోగం వచ్చాక కంటికి రెప్పలా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు పాలించిన వారు నిరుద్యోగుల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గ్రూప్-1 నియామకం కూడా చేపట్టలేదని.. అర్హత లేని వ్యక్తులకు టీజీపీఎస్సీలో కీలక బాధ్యతలు అప్పగించి వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ఓపిక పట్టిన యువత, అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి, ప్రజా ప్రభుత్వానికి పట్టం గట్టారని ఆయన గుర్తు చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘యూపీఎస్సీ చైర్మన్ను వ్యక్తిగతంగా కలిసి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను ఎలా పాటించాలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వచ్చాం. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా,..నిరుద్యోగుల కాలాన్ని వృథా చేయకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశాం’ అని ఆయన వివరించారు.
ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం గ్రూప్-3 ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములు కాబోతున్న అభ్యర్థులు, సామాన్య ప్రజలకు సేవ చేయడంలో నిజాయితీని ప్రదర్శించాలని కోరారు. అనంతరం వేదికపై ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ: Jabardasth Naresh: గంటలో 10 లక్షల… కోడి పందెంల్లో జబర్దస్త్ నరేష్కి వచ్చిన లాభం