తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్యకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మానవీయ కోణంలో స్పందించిన న్యాయస్థానం, కొన్ని ముఖ్యమైన షరతులతో ఆయనకు 48 గంటల పాటు బెయిల్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) కింద అరెస్ట్ అయిన ఇన్నయ్య, అప్పటి నుండి జ్యుడీషియల్ కస్టడీలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మానవీయ కోణంలో బెయిల్ మంజూరు
గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు.. ఆమెకు చివరి చూపు దక్కించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇన్నయ్య తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, తల్లి మరణం పట్ల సానుభూతి వ్యక్తపరుస్తూ.. ఆయనకు తాత్కాలికంగా బయటకు వచ్చేందుకు అనుమతినిచ్చింది.
కఠిన షరతులు
ఈ 48 గంటల బెయిల్ కాలంలో ఇన్నయ్య పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అంత్యక్రియల కార్యక్రమం ముగిసిన వెంటనే తిరిగి అధికారులకు రిపోర్ట్ చేయాలని, ఎటువంటి రాజకీయ ప్రసంగాలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గాదె ఇన్నయ్య, గతంలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఆయనపై ఉపా (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అప్పటి నుండి ఆయన జైలులోనే ఉంటున్నారు. రేపు థెరిసమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇన్నయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లికి చివరి వీడ్కోలు పలకనున్నారు.