అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన పర్యటన చివరి రోజున హార్వర్డ్ యూనివర్సిటీలో బిజీబిజీగా గడిపారు. హార్వర్డ్ వివిధ విభాగాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో పాటు ఎంఐటీ (MIT), కొలంబియా యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి నమూనాలు, తెలంగాణ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
ఈ భేటీలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ముఖ్యంగా సస్టైనబిలిటీ (సుస్థిరత), పర్యావరణ పరిరక్షణ, సామాజిక సాధికారతపై చర్చ సాగింది. రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రతిష్టాత్మక TelanganaRising 2047 విజన్ను విద్యార్థుల ముందు ఆవిష్కరించారు. రాబోయే రెండు దశాబ్దాలలో తెలంగాణ మరియు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయికి ఎలా చేరుకోబోతున్నాయో ఆయన వివరించారు. భారతదేశ భవిష్యత్తుపై అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, దేశాభివృద్ధిలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తన హాస్యచతురతతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ‘మీకు నాయకత్వం గురించి పాఠాలు చెప్పడానికి ఇక్కడి హార్వర్డ్ ప్రొఫెసర్లే సరైన వారు. నేను మీకు పాఠాలు చెప్పడానికి రాలేదు.. కేవలం అనుభవాలను పంచుకోవడానికి వచ్చాను. నేను ఇంపోస్టర్ ప్రొఫెసర్ను కాను, పరస్పర చర్చల ద్వారా నేర్చుకోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించడంతో హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది.
విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు భారతదేశంతో, ముఖ్యంగా తెలంగాణతో తమ అనుసంధానాన్ని పెంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ‘మీరంతా తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి’ అని ఆయన కోరారు. ముఖ్యమంత్రి మాటలతో స్ఫూర్తి పొందిన విద్యార్థులు, తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు సాంకేతిక మరియు మేధోపరమైన సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల ఆకర్షణకే కాకుండా, అంతర్జాతీయ విద్యావేదికలపై రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి తోడ్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Ambati Rambabu: అంబటి బండ బూతులు.. ఏకంగా చంద్రబాబునే, ఫైర్ అవుతోన్న తమ్ముళ్లు