Deputy CM Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్, మహాయుతి కూటమి నేతలు హాజరయ్యారు. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్ కు డిప్యూటీ సీఎంగా మహారాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా సునేత్ర పవార్ ఘనత సాధించారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు మధ్యాహ్నం ఎన్సీపీ (అజిత్ పవార్) శాసన సభా పక్ష సమావేశం నిర్వహించారు. అజిత్ పవార్ మరణం నేపథ్యంలో పార్టీ తదుపరి చీఫ్ గా సునేత్ర పవార్ పేరును ఛగన్ భుజ్ బల్ ప్రతిపాదించారు. ఆ పేరును దిలీప్ పాటిల్, ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. ఆ పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ కు అందజేశారు. ఎన్సీపీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సునేత్రకు ఉపముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆమె గవర్నర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా ప్రస్తుతం సునేత్ర.. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 6 నెలల్లోగా ఆమె మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సునేత్ర పవర్
సునేత్ర పవర్ చేత ప్రమాణస్వీకారం చేయించిన మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్
మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సునేత్ర పవార్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,… pic.twitter.com/BWKSWPo4lc
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
భర్త అజిత్ పవార్ స్థానంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అంశాన్ని ఆయన మరణించిన కొన్ని గంటల్లోనే సునేత్ర దృష్టికి తీసుకొచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్సీపీని తిరిగి ఏకీకృతం చేసేందుకు శరద్ పవార్ వర్గం పావులు కదిపినట్లు సమాచారం. అయితే ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం మాత్రం విలీనానికి అంగీకరించలేదని తెలుస్తోంది. అజిత్ పవార్ స్థానంలో తమ అధినాయకురాలిగా ముందుండి నడిపించాలని సునేత్ర పవార్ ను నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి విజ్ఞప్తిని మన్నించి.. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారని సమాచారం.
సునేత్ర పవార్ నేపథ్యానికి వస్తే.. ఆమె 1963 అక్టోబర్ లో జన్మించారు. ఔరంగాబాద్లోని SB కళాశాల నుండి పూర్తి చేశారు. సునేత్ర బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి బాజీరావు పాటిల్ స్థానికంగా బలమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1985లో అజిత్ పవార్ తో వివాహం అనంతరం.. ఆమె బారామతి హై-టెక్ టెక్స్ టైల్ పార్క్ అనే ప్రముఖ పారిశ్రామిక సంస్థకు నాయకత్వం వహించడం ప్రారంభించారు. ఆమె విద్యా ప్రతిష్ఠన్ అనే విద్యా సంస్థకు ట్రస్టీగానూ ఉన్నారు. 2010లో ఆమె ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా (EFOI)ను స్థాపించి దీని ద్వారా కటేవాడి గ్రామాన్ని దేశంలోని మొట్టమొదటి ‘పర్యావరణ గ్రామం’గా తీర్చిదిద్దారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల వరకూ కూడా ఆమె చాలా లో – ప్రొఫైల్ ను మెయిన్ టెన్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసి తన వదిన ఎంపీ సుప్రియ సులే (ఎన్సీపీ శరద్ పవార్ వర్గం) చేతిలో పరాభవం చెందారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు.