Hyderabad Roads: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన చేశారు. అంతర్జాతీయ పేరు సంపాదించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం కీలక ప్రతిపాదనలు చేశారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్చేంజ్కు ఇప్పటికే “టాటా ఇంటర్చేంజ్” అని పేరు పెట్టారు.
ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.
దిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం.. హైదరాబాద్లోని ప్రధాన రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న ప్రతిపాదనలపై దృష్టి సారించారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ప్రధాన రహదారిని “గూగుల్ స్ట్రీట్” అని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: Telangana: కేంద్రమంత్రివి అయ్యుండి రాష్ట్రానికి ఏమి చేశావ్.. కిషన్ రెడ్డిపై మండిపడ్డ మహేష్ కుమార్
ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించి వారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం ఈ ప్రతిపాదన చేశారు.