Revanth Reddy: శాంతి మార్గంలో నడవాలని ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు సేవాలాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో లంబాడీల పాత్ర మరువలేనిదని, తన రాజకీయ ప్రస్థానంలో కూడా గిరిజనుల ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 2006లో వైఎస్సార్ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా జెడ్పీటీసీగా తనను గెలిపించింది గిరిజనులేనని ఆయన కృతజ్ఞతగా స్మరించుకున్నారు. తండాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి తండాకు బీటీ రోడ్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. మిషన్ కాకతీయ పేరుతో కోట్లు ఖర్చు చేసినా సాగునీరు, కరెంట్ అందలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అచ్చంపేట ప్రాంతంలో 40 వేల వ్యవసాయ సోలార్ పంప్ సెట్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షపాతి అని, గతంలో రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర తమదేనని చెప్పారు. ప్రస్తుతం 17 లక్షల మందికి సన్నబియ్యం, 51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడమే కాకుండా, స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులను అందజేశామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించామని వివరించారు.
ఉద్యోగ నియామకాలపై స్పందిస్తూ, గత పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఇందిరా గాంధీ ఆనాడు భూములను పంచారు, కానీ ఇప్పుడు పంచడానికి భూములు మిగలలేదు. కాబట్టి యువత భూములు లేదా తాత్కాలిక పథకాలపై ఆధారపడకుండా విద్యపై దృష్టి సారించాలి.” అని పిలుపునిచ్చారు. గిరిజన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ల వంటి ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అందుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గిరిజన సంస్కృతిని కాపాడటంలో భాగంగా అచ్చంపేటలోని నల్లమల అడవుల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ క్షేత్రాన్ని వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేస్తామని, సేవాలాల్ 288వ జయంతి వేడుకలను అక్కడే జరుపుకుందామని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో మోసం చేసిన వారు, ఇప్పుడు విపక్షంలో ఉండి ప్రజల తీర్పునే తప్పుపడుతున్నారని విమర్శించారు. రాబోయే 20 ఏళ్ల పాటు ప్రజల కోసమే పనిచేస్తానని, తాను పుట్టిన అచ్చంపేట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.