Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆ పరమశివుడిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమం – ప్రకృతి వైపరీత్యాల నివారణ
రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ.. లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు భట్టి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రాష్ట్రం పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు. భక్తుల నమ్మకానికి నిలయమైన స్నానాల లక్ష్మీపురంలోని వైరా నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన గుర్తుచేశారు.
ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న స్నానాల ఘాట్, కళ్యాణ మండపం, రథశాల, వైరా నది రిటైనింగ్ వాల్ పనులను ఆయన నిశితంగా గమనించారు. అక్కడ నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ భవిష్యత్తులో స్థానిక 50 వేల మంది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భక్తులతో ఆత్మీయ పలకరింపులు
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, వివిధ స్టాల్స్ను భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా తిరునాళ్లకు వచ్చిన భక్తులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన భక్తులతో చిరునవ్వుతో ఫొటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
Also Read: మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!
ముఖ్యమంత్రి, మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు
మధిర మృత్యుంజయ స్వామి సన్నిధిలో గోత్ర నామాలతో అర్చన
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ సతీమణి నందినితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… pic.twitter.com/uNMFuFit7g
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2026