Revanth Reddy: కన్నవారి కడుపుకోత, ఆ పసివాడి నిస్సహాయత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదిలించాయి. అరుదైన జన్యు వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి జీవితంలో తెలంగాణ సీఎం ఆశాదీపం వెలిగించారు. కోట్లాది రూపాయల ఖర్చయ్యే వైద్యానికి మేమున్నామంటూ భరోసానిచ్చి, మానవత్వాన్ని చాటుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన చిన్నారి ఆర్యాన్ష్ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వల్ల రోజురోజుకూ ఆ బాలుడి కండరాలు బలహీనపడి, ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఆ పసిప్రాణం నిలవాలంటే ‘రిస్డిప్లామ్’ అనే సుమారు రూ. కోటిన్నర ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. అంత పెద్ద మొత్తం భరించే శక్తి లేక, బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ దయనీయ స్థితి సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆయన తక్షణమే స్పందించారు. ఆర్యాన్ష్ చికిత్సకు అవసరమైన పూర్తి సహాయాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని, చిన్నారి ప్రాణాలకు పూర్తి భరోసా ఇస్తున్నామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ప్రకటించారు. ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, వైద్య ఖర్చుల బాధ్యతను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
సకాలంలో స్పందించి, ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్ద మనసుతో తమ బిడ్డకు పునర్జన్మ లభిస్తుందని ఆర్యాన్ష్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Also Read: ‘దోచుకోవడం, దాచుకోవడం మీ నైజం’.. హరీశ్ రావు ఆరోపణలపై మంత్రి అడ్లూరి సంచలన కౌంటర్!
చిన్నారి ప్రాణాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారి జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశాదీపం వెలిగించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన బాలుడు ఆర్యాన్ష్.. పుట్టినప్పటి నుంచే 'స్పైనల్ మస్క్యులర్… pic.twitter.com/sdjiUQXcOM
— BIG TV Breaking News (@bigtvtelugu) June 13, 2026