CM Revanth Reddy : ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే చాలామంది అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని.. కానీ, మన ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని ప్రశంసించారు. ఆర్ధిక క్రమశిక్షణ మన ఆడబిడ్డల సొంతమన్నారు. మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లో జరిగిన WE Hub విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు.
కోటి మంది మహిళలు..
ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని.. సమర్ధవంతంగా నిర్వహిస్తే మరో వెయ్యి మెగావాట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా ఇస్తున్నామని అన్నారు. నగరాల్లోనూ సంఘ సభ్యుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచాలని పిలుపు ఇచ్చారు సీఎం.
Also Read : తెలంగాణ కేబినెట్ విస్తరణ రేసులో కొత్త పేర్లు..
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామన్నారు. విద్యార్థుల యునిఫార్మ్ కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా కల్పించామని చెప్పారు. వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని.. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను మహిళా సంఘాలకు ఇస్తున్నామని తెలిపారు. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని.. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించామని గుర్తు చేశారు సీఎం రేవంత్రెడ్డి.