CM Revanth Reddy: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని వ్యాఖ్యానించారు. తాను కూడా ప్రతి రోజు ఏదో ఓ కార్యక్రమంలో ఎంతో మందికి కండువాలు కప్పానని.. అసలు ఆ కండువా ఏంటో కూడా వాళ్లు చూసుకోకుండా కప్పించుకున్నారని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలా అయితే పార్టీ ఎలా మారినట్టు.. ఇది సీఎం లాజిక్..
స్వయంగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావే.. వారికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారని.. సమయం కేటాయించాలని కూడా అడిగినట్టు సీఎం గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు, వాళ్ళ జీతాల నుంచి నెలకు రూ.5000 పార్టీ ఫండ్ వెళ్తా ఉందని చెప్పారు. ఇవన్నీ టెక్నికల్ గా చూసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని సీఎం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ కు వాళ్ల ఉసురే తగిలింది..
కేసీఆర్ ఫ్యామిలీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు నలుగురు కలిసి ఒక ఆడపిల్ల మీద దాడి చేయాలని చూస్తున్నారు. కవితను బయటకు వెళ్ళగొట్టింది ఆ నలుగురే. నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదా ఉంది. తెలంగాణలో ఎంతోమంది ప్రజల ప్రాణాలను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నాడు. వాళ్ల ఉసురే కేసీఆర్ కు తగిలింది. కుమార్తె కవిత దూరమైంది. నా కూతురు పెళ్లికి నేను వెళ్లకపోవడం అనేది నాకు చాలా చిన్న సమస్య. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో అనేకమంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్నాడు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు..
కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వమన్నారు… ఇచ్చిన తర్వాత బీజేపీ మాట్లాడటం లేదు. సీబీఐకి ఇస్తే 48 గంటల్లోనే తేల్చుతామన్న కిషన్ రెడ్డి ఎందుకు దాక్కున్నారో సమాధానం చెప్పాలి. సీబీఐ ఒకసారి FIR చేసిన తర్వాత ఎవరినైనా విచారించవచ్చు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆపుతున్నారు. కిషన్ రెడ్డి ఆపుతున్నారు. 48 గంటల్లో తేల్చుతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు. ఫోన్ టాపింగ్ కేసు కోర్టులో ఉంది. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు లేవు. కిషన్ రెడ్డి కేటీఆర్ ఏది చెబితే అదే చేస్తాడు’ అని అన్నారు.
లోకేష్, తనకు తమ్ముడు అని కేటీఆర్ అంటున్నారు.. అలాంటప్పుడు తండ్రి లాంటి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రజలను కొడుతున్నప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలో లేదో మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తున్నాం. మా ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్ కి సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకుంది. హైదరాబాదులో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఏర్పడింది. అప్పుడు ఎందుకు వాళ్ళు అడ్డుకోలేదు. స్వయంగా కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో అడ్డంగా దొరికారు. కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు