CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పాటు ఆయన దేశ రాజధానిలో పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో ఏఐసీసీ నేతలను కూడా కలవనున్నారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. క్రీడా శాఖ, జల శక్తి మంత్రులతో సమావేశం అయ్యి చర్చించనున్నారు. అధికారిక సమావేశాలతో పాటు ఇటు పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్కు వివరించనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు. బనకచర్లపై సైతం మరోసారి సీఎం తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి వివరించనున్నారు.
ఇక అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్. ఈ నెల 12 నుంచి 18వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు సీఎం రేవంత్.
Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్! PDSU నేతలు హంగామా..
వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారని సమాచారం. కార్పోరేషన్ చైర్మన్ల నియామకంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు. పార్టీలో నేతలమద్య అంతర్గత విభేదాల ఫిర్యాదులపై సైతం చర్చించే అవకాశం ఉంది.