Kavitha: తన వెనక ఏ జాతీయ పార్టీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని తెలిపారు. దురదృష్టకర పరిస్థితుల్లో గత ఏడాది బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్న తాను ఈ ఏడాది చింత మడక నుంచి లండన్ వరకు బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకున్నానని అన్నారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి తెలంగాణ బిడ్డలతో కవిత ముఖాముఖి ముచ్చటించారు.
బతుకమ్మ సంబురాల కోసం తాను ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. లండన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ ఆడబిడ్డలు తరలిరావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది తన స్వగ్రామం చింత మడకలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తాను ఆ తర్వాత కోల్ బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్ లో వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జాగృతి ఆఫీస్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి, ఖతార్, మాల్టా, లండన్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ లో చీలికలు రావొద్దనే ఎంత ఇబ్బంది అయినా తట్టుకొని నిలబడ్డానని.. పార్టీ బాగుండాలి.. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ బాగుండాలని ఎంతో తగ్గి ఉన్నానని చెప్పారు.. తనకు పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు..
తన ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయన్నారు.. ఆడబిడ్డగా కుటుంబం బాగుండాలి.. పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తాను ఎంతగా సఫర్ అయినా ఏ ఒక్క విషయం కూడా బయటకు చెప్పలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు.. విషయాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాటిపై స్పందించకపోతే, మాట్లాడకపోతే అది తన తప్పు అవుతుందని.. అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందే తప్ప తాను ముందే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు.. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు అనవసరంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారని.. ఇలాంటి విషయాలన్ని తాను ప్రజల ముందు ఉంచానని చెప్పారు
తనను పార్టీ నుంచి బయటికి పంపడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు.. తెలంగాణవాళ్లకు రేషం ఎక్కువ ఉంటుందని.. తాను కూడా తెలంగాణ బిడ్డనేనని చెప్పారు.. తనను పార్టీ వద్దు అనుకున్నది కాబట్టి తాను పార్టీ ఇచ్చిన పదవిని వద్దు అనుకున్నానని చెప్పారు.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని.. చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదన్నారు.. కాంగ్రెస్ పాలిటిక్స్ లో అది ఒక భాగం కావొచ్చని అన్నారు.. త్వరలోనే చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి రాజీనామా ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం నిఖార్సుగా, ప్రాణం పోయినా పర్వాలేదు అని చేసిన వారిలో కొందరిలో రానురాను స్వార్థం ప్రవేశించిందని.. వాళ్లు మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పని చేశారని చెప్పారు.. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పోవాలి.. కానీ అది జరగలేదు అన్నది తన ఆవేదన అన్నారు.
ALSO READ: Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తెలంగాణ జాగృతిని దేశానికే రోల్ మోడల్ గా నిలపాలన్నదే తన సంకల్పమన్నారు.. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందన్నారు.. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడుతామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కోసం ముందుండి కొట్లాడి సాధించుకున్నామని.. బీసీ రిజర్వేషన్ల కోసం తానే ముందుండి కొట్లాడుతున్నానని చెప్పారు.. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది.. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.. ప్రజలకు ఏది మంచి చేస్తుందో ఆ దిశగా తన అడుగులు ఉంటాయని చెప్పారు..
‘పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని.. వాళ్లే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారని చెప్పారు.. రియల్ సోషల్ చేంజ్ కేసీఆర్ ద్వారా.. తెలంగాణ ఉద్యమం ద్వారానే జరిగింది.. ఇప్పుడు మళ్లీ రియల్ చేంజ్ కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలి..’ అని కవిత వ్యాఖ్యానించారు.