Collector Rizwan Basha: రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా (Collector Rizwan Basha) షేక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శివ శంకర్ ఆగ్రో ట్రేడర్స్ ఫర్టిలైజర్స్ షాప్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తోందన్నారు. ఎరువుల స్టాక్ వివరాలను ప్రతి రోజూ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలని, స్టాక్ బోర్డు ప్రకారం కచ్చితంగా నిల్వలు ఉండాలన్నారు. స్టాక్ లెక్కలలో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ వివరాలను ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలనీ, ఎరువుల ధరలు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉండాలన్నారు.
Also Read: Manchu Manoj: కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
అన్ని విక్రయాలు ఈ – పాస్ యంత్రం ద్వారా మాత్రమే జరగాలని, లైసెన్స్ లేకుండా ఎరువుల అమ్మకాలు జరగకూడదని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తరచూ పెస్టిసైడ్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఇక్కడ నిల్వచేసిన మందులు, వైద్య సామగ్రిని సెంట్రల్ డ్రగ్ స్టోర్కు తరలించాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోపల, పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అంతకుముందు గోనుపాడు శివారులో కలెక్టర్ పొలాలను సందర్శించి పంటల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయాధికారి ప్రతాప్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tobacco Seized: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్ను బోనెట్పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!