Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షీ నటరాజన్ చుట్టూ రెండు రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ఎందుకు తిరస్కరించారు? ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారితీసింది? అసలు ఆమెపై కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే అందులో కేసుల గురించి ప్రస్తావించలేదంటూ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెల్సిందే. ఇంతకీ ఆ కేసు వెనుక ఏం జరిగింది. ఈ కేసు వ్యవహారం తెలంగాణతో ముడిపడి ఉండటంతో ఆసక్తికరంగా మారింది.
న్యాయస్థానంలో ఓ పిటిషన్కు సంబంధించి మీనాక్షికి సమన్లు జారీ అయ్యాయి. ఓ మహిళను వేధించడం, చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు శివకుమార్రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు నిరాకరించారు మీనాక్షీ నటరాజన్.
ఇంతకీ ఆ కేసు వ్యవహారం ఏంటి? తెలంగాణలో ఏం జరిగింది?
ఆమెతోపాటు శివకుమార్రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, చిట్టెం అభిజయ్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఓ పిటిషన్ దాఖలైంది. నష్ట పరిహారం కింద రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని గతేదాడి ఆగస్టు 28న తార్నాకకు చెందిన శ్రీలత హైదరాబాద్ నాలుగో అదనపు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుంభం శివకుమార్రెడ్డిపై 2022, మే నెల 7న పంజాగుట్ట, 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అతడ్ని అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పీఎస్ పోలీస్స్టేషన్ వద్ద నిరసనకు దిగారు సదరు మహిళ. నారాయణ్పేట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
మీనాక్షీ నటరాజన్ దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లారు. శివకుమార్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. సస్పెన్షన్కు సంబంధించిన పేపర్ ఇవ్వాలని అడిగితే స్పందించలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా నియమించింది. నారాయణపేట ఎమ్మెల్యే పర్నికరెడ్డి, ఆయన ఒకే వేదికపై కనిపించినట్టు ఆ పిటిషన్లో పేర్కొన్నారు సదరు మహిళ.
ALSO READ: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!
ఈ విషయాన్ని తెలంగాణ బాధ్యతలు చూస్తున్న మీనాక్షీ నజరాజన్, అంతకుముందు దీపాదాస్ మున్షీ దృష్టికి కూడా తీసుకెళ్లానని పేర్కొన్నారు. శివకుమార్రెడ్డి స్థానంలో డీసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రి వాకిటి శ్రీహరి తనకు న్యాయం చేయలేదని సదరు మహిళ ప్రస్తావించారు. వారిపై చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం.. మీనాక్షీ నటరాజన్ సహా పలువురు నేతలకు సమన్లు జారీ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ను తిరస్కరించింది. మీనాక్షీ నటరాజన్ ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.