Karimnagar: స్వేచ్ఛ బ్యూరో: కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల్లో కొందరు అవినీతిలో నయా ట్రెండ్ సృష్టించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన పలువురి నుంచి వేలల్లో గుంజారు. చాలారోజులుగా నడుస్తున్న ఈ అవినీతి బాగోతం బయట పడటంతో ఉన్నతాధికారులు సైతం షాకయ్యారు. వెంటనే విచారణ చేపట్టి ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది పాత్రనే ఉందా? ఇంకా పై స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా? అన్న దిశగా ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతుండటంతో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వీటిలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్లకు అడ్డుకట్ట వేయటానికి రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీకెండ్ లలో ఖచ్చితంగా ఈ టెస్టులు చేస్తున్నారు. తనిఖీల్లో వాహనదారులు ఎంతమేర మద్యం సేవించారన్నది నిర్ధారించుకుని వారి వాహనాలు, డాక్యుమెంట్లను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం సంబంధిత కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు.
సరిగ్గా దీనినే కరీంనగర్ లో కొందరు ట్రాఫిక్ సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తనిఖీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు పట్టుబడితే కోర్టుకు పంపిస్తే మీ ఉద్యోగంపై ప్రభావం పడుతుంది. నలుగురిలో పరువు పోతుందంటూ బెదరగొడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే మేం చెప్పినట్టు చేయండి అంటూ వేలల్లో బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఆ తరువాత మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడన వారి స్థానంలో మరొకరిని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. ఇక, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ దొరికినపుడు స్వాధీనం చేసుకున్న వాహనాల డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వటానికి కూడా డబ్బు గుంజుతున్నారు.
Also read: గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!
మే 19న పద్మనగర్ కు చెందిన బేతి రాజేందర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ ఆర్ఎస్ఐ శ్రీకాంత్ కు పట్టుబడ్డాడు. అయితే, నిందితుడు కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయ్యింది. ఈ విషయం వెలుగు చూడటంతో కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విచారణకు జరిపించారు. దీంట్లో ఆర్ఎస్ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాయి కృష్ణ, డీడీ డిస్పోసల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. కిరణ్లు కలిసి నకిలీ ట్రయల్ కేసు సమ్మరీ నెంబర్ ను పోలీస్ సైట్లో నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ మేరకు సీపీ నివేదికను పంపించగా ముగ్గురిని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసు బయట పడిన నేపథ్యంలో కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు ఇతర పోలీసు స్టేషన్లలో నమోదు అయిన డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో సమగ్ర విచారణను కొనసాగిస్తున్నారు. 2025 జనవరి నుండి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై నివేదిక ఇవ్వాలని సీపీ గౌస్ ఆలం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జరిపిన విచారణలో 113 కేసుల్లో డూప్లికేట్,. రిపీటడ్ ట్రయల్ కేసు సమ్మరీ నెంబర్లను గుర్తించారు. వీటిలో13 కేసుల్లో అవినీతి జరిగినట్టు నిర్ధారించారు. నిందితులు కోర్టుకు హాజరు కాకుండానే ఆరు, మూడు, వెయ్యి రూపాయల జరిమానాలు చెల్లించినట్టు చూపించి కేసులను తప్పుగా డిస్పోజ్ చేసినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి 9,700 రూపాయలను లంచంగా వసూలు చేసినట్టుగా గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన విచారణలో 14 కేసుల్లో 34,700 మేర అవినీతి జరిగినట్టుగా తేలిందని సీపీ తెలిపారు.
Also Read: తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!