Adanki Dayakar: గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు తెరలేపింది కేసీఆరేనని గుర్తు చేస్తూ.. నాడు ‘పార్టీ ఫిరాయిస్తే చీరి చింతకు వేస్తా’ అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కేటీఆర్దని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వాన్ని కాలదన్ని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తెచ్చుకునే దమ్ము కేటీఆర్కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను దయాకర్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్త పబ్లిసిటీ కోసమే కేటీఆర్ ఇలాంటి ‘స్టుపిడ్’ వ్యాఖ్యలు చేస్తున్నారని, రాహుల్ గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ ఒక ‘ఈడియటిక్ లీడర్’ అని, బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు గతంలో ఏ పార్టీ నుండి గెలిచి, ఏ పార్టీలో చేరారో అందరికీ తెలుసని దానం నాగేందర్ లాంటి వారు కూడా తమకు నచ్చిన పార్టీలో ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు.
భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేసి CCLAలో కలిపింది కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తూ.. ఖమ్మం భూ నిర్వాసితులకు తమ ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని స్పష్టం చేశారు. సొంత కుటుంబంలో ఆత్మహత్యలు జరిగినా పట్టించుకోని వారు ఇతరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.
బీజేపీని సంతోషపెట్టడం కోసమే బీఆర్ఎస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని, కేటీఆర్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మొత్తానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ లోపం వల్లే ఆ పార్టీ ఖాళీ అవుతోందని, ప్రశ్నించే హక్కు కేటీఆర్కు లేదని అద్దంకి దయాకర్ ఘాటుగా స్పష్టం చేశారు.
Also Read: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ