Appalanayudu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా, బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్లోని నాలుగు గోడల మధ్య పిల్లిలా కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక వనరులు, వ్యవస్థ గురించి జగన్ మాట్లాడుతుంటే ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎంపీ విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో మున్సిపల్ ఆఫీసులను సైతం తాకట్టు పెట్టిన చరిత్ర జగన్దని, దేశంలో ఎక్కడా లేని వింత పాలసీలతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేంద్రానికి లేఖ రాస్తానని జగన్ అంటున్నారని, అయితే ఆయన హయాంలో జరిగిన అరాచకాల చిట్టా మొత్తం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని జగన్ అనడం హాస్యాస్పదమని అప్పలనాయుడు అన్నారు. సొంత కన్నతల్లికి, చెల్లికి జగన్ ఎంత రక్షణ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కేవలం రాజకీయాల కోసం సొంత చెల్లెలుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అదే విధంగా సొంత మద్యం బ్రాండ్లతో వేల కోట్లు గడిస్తూ, సుమారు 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంపిన పాపం జగన్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ‘మీ బాస్ ఇచ్చిన లేఖ మర్చిపోయారా’? టీడీపీ ఎంపీకి చామల చురకలు