Chamala Kiran Kumar: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న తరుణంలో, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏదో రకంగా గెలిచేందుకు బీఆర్ఎస్ నేతలు తొండి చేస్తున్నారని ఆరోపించిన ఆయన, కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేటీఆర్ తన తండ్రిని జాతిపిత అంటూ పిట్టకథలు చెబుతున్నారని, కానీ వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే కోపంతోనే కేసీఆర్ బయటకు వచ్చారనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.
హరీష్ రావుపై ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయిన లక్కీ స్టార్ హరీష్ రావు అని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఒక గుంట నక్క అని, తన మామ తుది శ్వాస విడిస్తే ఆ పదవిని దక్కించుకోవాలని కుర్చీ దగ్గరే వేచి చూస్తున్నారని సాక్షాత్తూ కవిత గారే చెప్పారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఎవరి సహాయం లేకుండానే స్వయంకృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, అది చూసి హరీష్ రావుకు కడుపుమంట పుడుతోందని వ్యాఖ్యానించారు. ఆ కడుపుమంట తగ్గడానికి హరీష్ రావుకు ‘ఈనో’ (ENO) ప్యాకెట్ ఇవ్వడం తప్ప తాను చేయగలిగింది ఏమీ లేదని సెటైర్లు వేశారు. కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డి అమెరికా నుంచి ఊడిపడలేదని, క్షేత్రస్థాయి నుంచి వచ్చారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ఆత్మగౌరవం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. గద్దర్ లాంటి ప్రజా గాయకుడిని గేటు దగ్గర కూర్చోబెట్టినప్పుడు, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను బయటకు పంపించినప్పుడు కేసీఆర్ కు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఉద్యమ సమయంలో తన కుటుంబంలో ఎవరికీ పదవుల ఆశ లేదని చెప్పిన కేసీఆర్, రాష్ట్రం వచ్చాక మాత్రం తన కుటుంబ సభ్యులకే మంత్రి, ఎంపీ పదవులు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను వంచించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్ హామీని కూడా నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై స్పందిస్తూ, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-3 పరీక్షలను లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు రావడం, జూబ్లీహిల్స్ లాంటి చోట్ల ఓడిపోవడం బీఆర్ఎస్ పతనానికి సంకేతాలని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పును పునరావృతం చేస్తారని కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కొత్త అధ్యక్షుడు.. ఎవరంటే?