తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ ఎన్నికలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెజ్ జైతయాత్ర
రాష్ట్రంలోని మొత్తం 12,702 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెబల్స్ కలిపి 8,335 స్థానాలను కైవసం చేసుకున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంటే దాదాపు 66 శాతం పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఆయన వివరించారు. మరోవైపు బీఆర్ఎస్-బీజేపీ కూటమి 33 శాతానికి పరిమితం కాగా, కమ్యూనిస్టులు 1 శాతం ఫలితాలను సాధించారని తెలిపారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగగా, ఏకంగా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ప్రభుత్వ పట్ల ప్రజలకున్న విశ్వాసానికి సంకేతమన్నారు.
సంక్షేమ పథకాలే విజయ సోపానాలు..
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ ఏడో గ్యారంటీగా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజలు ఆదరించారని ఆయన తెలిపారు. ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని, 2029లో కూడా కాంగ్రెస్ పార్టీ 2/3 వంతు మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్..
ప్రతిపక్షంలో ఉన్నా కొందరిలో అహంకారం తగ్గలేదని.. అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తామన్నారు. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన్ను ఓడించి అధికారం చేపట్టాం. ఇప్పుడు ఆయన క్రియాశీలకంగా లేరు. అయినప్పటికీ కృష్ణా జలాల అన్యాయంపై చర్చకు రావాలని ఆయనకు సవాల్ విసురుతున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చివరగా.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడిన సీఎం, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. త్వరలోనే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.