Hyderabad 5K Run Event: భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా.. 5కే రన్ను నిర్వహిస్తున్నట్లు ఏక్ నయీ దిశ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది మోక్ష కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 5కే రన్కు సంబంధించిన బ్రోచర్ను ఆయన అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల హృదయాలకు చేరువ చేసే దిశగా ముఖ్యమైన అడుగుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30న నిర్వహించనున్నారు.
మోక్ష కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఫిట్నెస్, ఆరోగ్యం కోసం అనేక రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, దేశ పౌరులలో రాజ్యాంగ చైతన్యం పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యంతో.. ఈ 5కే రన్ను నిర్వహిస్తున్నామని వివరించారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు మాత్రమే కాదు, మనపై ఉన్న బాధ్యతలను కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను యువతకు, ప్రజలకు చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం అని ఆయన స్పష్టం చేశారు.
ఈ అవగాహనా 5కే రన్ నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమై సంజీవయ్య పార్కు వద్ద మీటింగ్తో ముగుస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గంలో నిర్వహించే ఈ రన్ ద్వారా.. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశముంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాజ్యాంగ విలువలను బలంగా ముందుకు తీసుకెళ్లగలమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు జస్టిస్ నాగేష్, జస్టిస్ చలపతిరావుతో పాటు సైబర్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సైబర్ క్రైమ్ డీసీపీ సైదులు కూడా హాజరుకానున్నారని తెలిపారు. వీరి సమక్షంలో రన్ ప్రారంభం కావడం ద్వారా ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందని ఫౌండేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
5కే రన్లో పాల్గొనే రన్నర్లకు టీషర్ట్తో పాటు మెడల్ అందించి సత్కరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా, నామమాత్రపు రుసుముతో టీషర్ట్, బ్రేక్ఫాస్ట్ కూడా అందజేస్తామని తెలిపారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు సులువుగా పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో బలంగా నాటే ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ రన్కు.. ఇప్పటికే మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన పెంచుకుని, దేశ నిర్మాణంలో బాధ్యతాయుత పౌరులుగా మారాల్సిన అవసరాన్ని గుర్తించాలి అని మోక్ష కళ్యాణ్ రామ్ అన్నారు. దేశం కోసం బాధ్యతగా చేసే ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతే ప్రధాన బలం అని ఆయన అన్నారు.
Also Read: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఈ 5కే రన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, పాల్గొనదలచిన వారు శనివారం రాత్రి వరకు eknayeedisha.com వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే వీలుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన ప్రతి ఒక్కరికీ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా తెలియజేస్తామని నిర్వాహకులు తెలిపారు.