Nagarkurnool: స్వేచ్చ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ ఎన్నికల వేడి ఎండలను సైతం మరిపిస్తుంది. ఈనెల చివరి వారంలో నలుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు మున్సిపాలిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆశావహుల్లో ఆ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల అభయహస్తం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ పాగావేసింది. మొత్తం 24 వార్డుల గాను 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తీగల సురేంద్ర మున్సిపల్ చైర్మన్గా, బాదం రమేష్ వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. ఎంతోమంది ఆశావహులు ఈ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సదరు కౌన్సిలర్లని చైర్మన్, వైస్ చైర్మన్ లుగా ప్రకటించడంతో చేతులెత్తి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఇలా ఎంఎల్సీ, ఎమ్మెల్యేల నిర్ణయానికే కౌన్సిలర్లు జై కొట్టారు.
Also read: వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ
ఇలా ఉండగా మున్సిపాలిటీలో మరో కీలకమైన కోఆప్షన్ పదవుల కోసం పదుల సంఖ్యలో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీ ఎన్నికలవేళ కో ఆప్షన్ ఇస్తామని ఎంఎల్సీ, ఎమ్మెల్యేల నుంచి హామీ లభించిందని కొందరు మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు మారడంతో కౌన్సిలర్ల పోటీ నుంచి తప్పుకున్న పట్టణ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన మరికొందరు కో ఆప్షన్ పదవుల కోసం గంపెడాశతో ఉన్నారు. సీపీఎం పార్టీ మహిళా నేత కూడా కో ఆప్షన్ పదవి ఆశిస్తున్నారు. మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్ పదవులకు మున్సిపాలిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగి యున్న ఇద్దరు సభ్యులు ఉండాలి. అందులో ఒకరు మహిళా సభ్యులు అయిఉండాలి. ఇక అల్పసంఖ్యాక వర్గమునకు చెందిన ఇద్దరు సభ్యుల్లోనూ ఒకరు మహిళ అయి ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం పలువురు ఆశావహులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. దీనివల్ల కొందరిలో నిరాశ ఆలుముకుంది. అర్హత ఉన్న పలువురు ఇప్పటికే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. రిజర్వేషన్లు మారడంతో పార్టీ కోసం పనిచేసి, ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని త్యాగం చేసిన తమకు కో ఆప్షన్ ఇచ్చి న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఆప్షన్ ఎవరికి ఉంటే వారికే కో ఆప్షన్ పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది.
Also Read: మత్స్యకారుల ఆశీస్సులు జగన్కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!