Gadwal District: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిందని మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పనులు జరగవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యాలయాలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారిని అధికారులు, సిబ్బంది నెలల తరబడి తిప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సకాలంలో పనులు జరగక విసుగుచెందిన వారు కార్యాలయంలో ఎంతో కొంత ముట్టజెప్పి తమ పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా అక్రమంగా భూముల పట్టాలను అటు ఇటుగా మార్పిడి చేస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నట్లు గద్వాల, మల్దకల్, అయిజ, గట్టు, కేటి దొడ్డి, ఇటిక్యాల, ఎర్రవల్లి తదితర మండలాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏది ఏమైన అక్రమ సంపాదనే ధ్యేయంగా అధికారులు కంకణం కట్టుకున్నారని అధికారుల తీరుతో ప్రజలు విస్తుపోతున్నారు. అక్రమాలకు తోడు భూముల ధరలు ఆకాశానికి తాకడం వారికి కలిసి వచ్చే అంశంగా మారింది. కార్యాలయానికి వచ్చే మధ్యవర్తుల ద్వారా సైతం అధికారులు రాయబారం నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేటతెల్లం అవుతుంది.
రైతులు తమ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చేసుకోవడానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే ఇక్కడ రైతులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే భూమిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఫైలుకు ఇంత అని కింది స్థాయి సిబ్బంది వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే ఫైలు వెనక్కి పోవాల్సిందే.
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఈ జిల్లానే టాప్..?
లంచమిస్తేనే పనులు చేస్తున్నారని జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాలకెళ్లే వారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలున్నాయి. కొందరు తహసీల్దార్లు భూభారతి దరఖాస్తులను ఆసరాగా తీసుకొని అందిన కాడికి దండుకుంటుంటే.. మరికొందరు ఏకంగా రూ. లక్షల విలువ చేసే ప్రభుత్వ భూములకే ఎసరు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమార్కులతో చేతులు కలిపి రికార్డులను తారుమారు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అయిజ మండలంలో ఓ రైతు తాతలకాలం నుంచి భూమి పొజిషన్ లో ఉంటూ సాగు చేస్తున్నాడు.
తహసీల్దార్ నిర్వాహం వల్ల రికార్టులోనుంచి తొలగించి ప్రభుత్వ భూమి రికార్డులోకి ఎక్కడంతో న్యాయం చేయాలని అర్డిఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన అధికారులు కనికరించలేదు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మడం, కొనడం నిషేధమైనా తహసీల్దార్ అక్రమార్కులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్దకల్ మండల తహసీల్దార్ ఓ అర్సీ ఉన్న ఇనాం భూముల రిజిష్టర్ కోసం బహిరంగానే రూ.5-10వేలకు డిమాండ్ చేస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములున్న రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని బ్యాంకర్లకు తెలియకుండానే ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇదే ఆసరగా తీసుకుని తహసీల్దార్ కాసులకు కక్కుర్తి పడి రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో మల్దకల్ మండలంలో వెలుగులోకి వచ్చింది.
రెవెన్యూకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇతర శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్దరించి వారిని గ్రామ పాలనాధికారులుగా నియమించింది. జీపీవోలుగా గ్రామాల్లో వివిధ ధ్రువ పత్రాల జారీకి సంబంధించిన విచారణలు నిర్వహించడం, ప్రభుత్వ భూములు, నీటి వనరుల ఆక్రమణలపై విచారణ నిర్వహించి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. భూ వివాదాలు పరిశీలించడం.. సర్వేయర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. విపత్తుల సమయాల్లో దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడం తో పాటు అత్యవసర సేవలను అందించాలి. కాని జీపీఓలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. కేటిదొడ్డి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ రైతు మరణిస్తే కుటుంబసభ్యుల పేరిట విరాసత్ చేయడానికి జీపీఓ అయిదు నుంచి పది వేల రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు.
Also Read: Aiden Markram: రెండు చెంపలపైన చెల్లుమనేలా కొట్టారు..సెమీస్ ఓటమిపై మార్క్రమ్ కన్నీళ్లు !