Veenavanka Tahsildar Office: వీణవంక స్వేచ్ఛ: కరీంనగర్ జిల్లా వీణవంక మండల తహసిల్దార్ కార్యాలయం (Veenavanka Tahsildar Office) అవినీతి కూపంగా మారిందని మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల సవరణ, పాస్బుక్ మార్పులు, ఫీల్డ్ సర్టిఫికెట్లు, ఆదాయ రేషన్ ధృవపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలు లంచాల డిమాండ్లతో నానా అవస్థలు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక రైతు తన భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా పక్కనపెట్టి, వీణవంక తహసిల్దార్ కావాలనే ఫైల్ను ఆపేశారని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేకుండా మౌనం పాటించడమే అనుమానాలకు దారి తీస్తోంది. ఖర్చు పెట్టాలి. అన్న మాట నినాదంలా? ప్రతి చిన్నపాటి పనికీ ఖర్చు పెట్టాలి. ముందు మాట్లాడాలి. అదీ చూడాలి. అనే మాటలు కార్యాలయంలో నినాదాల్లా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ అనుచరులు, మధ్యవర్తులు ఫైళ్లను పట్టివేసి… పేదలు, రైతులను రోజుల తరబడి కార్యాలయ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో వీణవంక తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మొత్తం సిబ్బందిని బదిలీ చేసి, కొత్త సిబ్బందిని నియమించినా అవినీతి విధానం మాత్రం మారలేదన్న విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి. డిప్యూటీ తహసిల్దార్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి తన చేతివాటం ప్రదర్శించిన సమయంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించగా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో తహసిల్దార్ తిర్మల్ రావు కూడా సస్పెండ్ కావడం ఈ కార్యాలయంలో సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పకనే చెబుతోంది.