Allagadda Politics: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాత ఎస్వీ సుబ్బారెడ్డి మంత్రిగా, తండ్రి భూమా నాగిరెడ్డి ఎంపీగా, తల్లి శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అలాంటి కుటుంబంతో ముందు నుంచి ఏవీ సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉండేవారు. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డి భూమా వారుసలతో విభేదిస్తున్నారు. తమ ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి తన పేరుపైకి మార్చుకున్నారని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. దాంతో ఏవీ వర్సెస్ భూహా ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల ముందు జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గం దాడి చేసిందని వైసీపీ సర్కారు ఆమెను జైలుకు కూడా పంపింది. ఇటీవల ఏవి సుబ్బారెడ్డి మున్సిపాలిటీ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారని అధికారులు కూల్చివేశారు. అది అఖిలప్రియ పనేనని ఆరోపిస్తున్న ఏవీ ఆరోపిస్తున్నారు. దాంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోందంట.
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె శోభానాగిరెడ్డి దంపతులు ఆళ్లగడ్డ, నంద్యాలల్లో చక్రం తిప్పారు. అయితే భూమానాగిరెడ్డి, శోభాల అకాలమరణాలతో భూమా కుటుంబంలో రాజకీయాలు రోజురోజుకు మారుతూ వచ్చాయి… తల్లి తండ్రుల మరణం తర్వాత అఖిలప్రియ రాజకీయంగా భూమా ఫ్యామిలీకి పెద్దదిక్కయ్యారు. 2014లో తొలిసారి ఆళ్లగడ్డ ఉపఎన్నికలలో గెలిచిన అఖిలప్రియ అప్పటి కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి చెవి చూశారు. 2024 ఎన్నికల్లో భూమా అఖిలప్రియ మరోసారి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
ఒకప్పటి ఆళ్లగడ్డ అంటే అందరికీ ముందుగా భూమా అనే బ్రాండ్ వినిపించేది. ఆళ్లగడ్డ నుంచి భూమానాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్రెడ్డి, తర్వాత నాగిరెడ్డి చెరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత భూమా శోభానాగిరెడ్డి అయిదు సార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత వెలువడిన ఫలితాల్లో ఆమె విజయం సాధించినట్లు ప్రకటించారు. ఇక ఆమె వారుసురాలిగా అఖిలప్రియ బైపోల్స్లో టీడీపీ నుంచి మొదటిసారి గెలిచి మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో అఖిలప్రియ రెండో సారి గెలిచారు. అలాంటి భూమా కుటుంబంలో నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డలో రాజకీయ పరిస్థితులు మారుతూ వచ్చాయి. అయితే నాగిరెడ్డి దంపతులు ఆళ్లగడ్డలో చేసిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. టీడీపీకి పెట్టని కోటలా ఉండే ఆళ్లగడ్డంలో పీఆర్పీ, వైసీపీ పార్టీలు రావడంతో సమీకరణలు మారుతూ వచ్చాయి. భూమ దంపతుల మరణం తర్వాత పార్టీ క్యాడర్ పక్కదారి పట్టడం టీడీపీకి ఒకింత మైనస్ అయిందంటారు.
ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి రైట్హ్యాండ్గా ఉంటూ వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి ఆ కుటుంబంతో సఖ్యత కుదరకపోవడంతో నిత్యం వర్గ విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు నిత్యం ఘర్షణలతో వార్తలకెక్కుతూ.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. భూమ కుటుంబాన్ని ఏవీ సుబ్బారెడ్డి మోసం చేసి ఆస్తులు సొంతం చేసుకున్నారన్న ఆరోపలున్నాయి. అఖిలప్రియ నిత్యం ఏవి సుబ్బారెడ్డి తమ కుటుంబాన్ని మోసం చేశారని మండిపడుతుంటారు. తమ కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ వెన్నుపోటు ఏవీ తమను పొడుచారని అఖిల ధ్వజమెత్తుతుండటంతో రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. ఆ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డి, నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తుండటం అగ్గికి ఆజ్యం పోసినట్లు అవుతోందంట. టీడీపీ అధిష్టానం మాత్రం భూమా వారసులకే టికెట్లు కేటాయిస్తుండటంతో ఏవీ రగిలిపోతున్నారంట.
గత ఎన్నికల ముందు లోకేష్ యువగళం పాత్రయాత్ర సమయంలో అఖిల వర్గం ఏవీ సుబ్బారెడ్డి మీద దాడి చేయడంతో వారి మధ్య విభేదాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ఆ దాడి జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం అఖిలప్రియపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది. జైలుకు వెళ్లే ముందు ఆమె ఈ కుట్రకు పాల్పడిన వారిపై రానున్న రోజుల్లో కచ్చితంగా చర్యలు ఉంటాయని, తన పసిబిడ్డను వదిలి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని, వారి అంతు చూస్తానని శపధం చేశారు. అయితే అఖిలప్రియ మరోసారి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలవడంతో పరిస్థితులు మారతాయని నియోజకవర్గ ప్రజలు భావించారు.
కానీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాల నుంచి ప్రతిదానికి ఒక రేటును ఫిక్స్ చేసి ఎమ్మెల్యే వర్గీయులు వసూళ్లు చేస్తున్నారని ప్రత్యర్ధులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ కోళ్ల రాజకీయంతో నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలు కూడా ఆ ఎమ్మెల్యే పనితీరుపై మండిపడుతున్నారట. భూమా వర్గీయులంతా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటూ ప్రతి విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నారని కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఆ క్రమంలో అఖిలప్రియ నిత్యం వివాదాలకు కేరాఫ్ గా మారుతుండటం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పి మారిందంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఆమె తీరుపై చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని కూటమినేతల్లో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది…
అదలా ఉంటే ఆళ్లగడ్డలో ఇటీవల తాను అక్రమ నిర్మాణం చేపట్టానంటూ కూల్చివేయడం వెనక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు హస్తం ఉందని ఏవీ సుబ్బారెడ్డి రగిలిపోతున్నతారంట. వారి బాగోతం అంతా పార్టీ అధిష్టానంతో చర్చించి, అన్నింటినీ బయటికి తీస్తామని ఏవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ అక్కడ హాట్ టాపిక్గా మారాయి. మొత్తానికి ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న వార్ పార్టీ అధిష్టానానికి పెద్ద తల్లినొప్పికి మారడంతో.. దానికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో అన్న ఉత్కంఠ పార్టీ క్యాడర్ లో నెలకొంది.
Story by: Apparao, Big Tv