Hyderabad City: హైదరాబాద్ సిటీలో అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించేందుకు ఆపరేషన్ కవచ్ పేరిట తనిఖీలు ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని దాదాపు 5 వేల మంది పోలీస్ సిబ్బంది హోటళ్లు, ఓయో లాడ్జీలు, రూమ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బస చేయడానికి వచ్చిన వచ్చిన వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటిగంట వరకు ఈ తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ కవచ్ ముమ్మరం
హైదరాబాద్ సిటీలో అంతర్గత భద్రత పటిష్టం చేయడం, అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించే లక్ష్యంతో ఆపరేషన్ కవచ్ పేరిట తనిఖీలు చేపట్టారు పోలీసులు. సిటీలోని మొత్తం 562 హోటళ్లు, ఓయో లాడ్జీలు, రూములను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. హోటల్, లాడ్జి రిజిస్టర్లను తనిఖీలు చేశారు.
బస చేయడానికి వచ్చిన వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా వాటిని నిశితంగా పరిశీలించారు. శుక్రవారం రాత్రి నగరంలో అర్థరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది చేసే తనిఖీల్లో పాల్గొన్నారు.
రంగంలోకి సీపీ సజ్జనార్, ఓయో రూమ్స్-లాడ్జీల తనిఖీలు
నాంపల్లి, అమీర్పేటలోని పలు ఓయో లాడ్జీలు, రూములను స్వయంగా సందర్శించారు. బస కోసం వచ్చినవారికి గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు రిజిస్ట్రర్లను పరిశీలించారు. లాడ్జీల్లో బస చేసినవారితో నేరుగా మాట్లాడారు. ఏ ప్రాంతం నుండి నగరానికి వచ్చారు? సందర్శనకు గల కారణాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.
తనిఖీలలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో 562 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు చేపట్టారు. జోన్ల వారీగా లాడ్జీలు, హోటళ్ల తనఖీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖైరతాబాద్-119, శంషాబాద్-92, జూబ్లీహిల్స్, గోల్కొండ ఏరియాలు-86, సికింద్రాబాద్- 82, రాజేంద్రనగర్-53, చార్మినార్-44 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు.
ALSO READ: అమెరికాలో రాత్రి దారుణం.. పిజ్జా డెలివరీ చేస్తుండగా ఓ కుర్రాడిని కాల్చి.. మృతుడు మేడ్చల్ నివాసి
ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు హోటళ్లు, లాడ్జీల్లోని రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్, సిటీలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే తనిఖీల ముఖ్య ఉద్దేశమన్నారు.
లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ పరిశీలన, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు సమాచారంతో గదులు కేటాయించరాదని స్పష్టం చేశారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వరాదని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలన్నారు.
సాంకేతికతకు అనుగుణంగా త్వరలో నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. హోటల్ పరిసరాలలో ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.