CPI Strategy: స్వేచ్ఛ బ్యూరో: సీపీఐ దూకుడు పెంచింది. కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో పాటు ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలుచుకోవడంతో నూతనోత్తేజం పార్టీకి వచ్చినట్లయింది. కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తుంది. ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసిపోటీ చేయలేదు. కొన్ని చోట్లమాత్రమే(అవసరం ఉన్నదగ్గర) పోటీ చేశాయి. అయితే పొత్తు విషయం చివరి వరకు తేలకపోవడంతో సీపీఐ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొత్తుతో సంబంధం లేకుండానే ఒంటరిగానే పోటీకి కేడర్ ను ఇప్పటినుంచే సిద్ధం చేసేందుకు కసరత్తును ప్రారంభించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తుతో ముందుకెళ్లింది. కొత్తగూడెం అసెంబ్లీని కైవసం చేసుకుంది. అయితే ఆతర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కలిసిపోలేదు. కొన్ని చోట్లమాత్రమే కలిసి పోటీచేశాయి. సీపీఐ అడిగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉంది. ఇటీవల నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ మిత్రధర్మం పాటించడం లేదని, పద్దతి మార్చుకోవాలని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని, పద్దతి మారకపోతే పొత్తుకు దూరంగా ఉంటామనిప్రకటించారు. ఒకటిరెండు జిల్లాల్లో మినహా సీపీఐకి కాంగ్రెస్ సహకరించడం లేదని, పొత్తు ఉండాలా? కొనసాగాలా అనే నిర్ణయం వారికే వదిలేస్తున్నామని, భవిష్యత్ ఇలానే ఉంటే రెండుపార్టీలకే నష్టమేనని ప్రకటించారు. కాంగ్రెస్ మిత్రధర్మం పాటించట్లేదని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమతో పొత్తు లేకపోతే ఏమి జరుగుతో పార్టీలకు ఒక జలకు పుట్టించామని పేర్కొన్నారు. సిపిఐ ఎవరితో పొత్తు పెట్టుకున్నఆ ధర్మాన్ని తు.చ. తప్పకుండ పాటిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకు రెండుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయా? లేక ఎన్నికలప్పుడే ఒకటవుతున్నాయా? అనేది చర్చకు దారితీసింది.
మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం మున్సిపాలిటీని తమకు కేటాయించాలని సీపీఐ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచింది. కానీ ససేమిరా అనడంతో పొత్తుకుదరలేదు. ఒంటరిగానే సీపీఐ పోటీ చేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఆపార్టీ కేడర్ లో నూతనోత్తేజం నింపింది. ప్రజల్లో సీపీఐకి ప్రజాదరణ ఉందని, పొత్తు లేకున్నా సత్తాచాటుతామని నేతల్లో సైతం ధీమా వచ్చింది.దీంతో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఇప్పటినుంచే సిద్ధమవుతుంది. అందుకు కేడర్ ను సన్నద్ధం చేసేందుకు ప్రజాసమస్యలపై పోరాటపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని భూదాన బాధితులకు, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు సింగరేణిని పై పోరాటబాటకు సిద్ధమవుతుంది. సీపీఐ అనుబంధ యూనియన్ ఏఐటీయూసీ ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు చేపట్టే బస్సు యాత్ర కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంటే కాంగ్రెస్ పై పరోక్షంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చింది. పొత్తులేకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పరోక్షంగా హెచ్చరికలు జారీచేసినట్లయింది.
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు భేటికి ప్రయత్నాలు ప్రారంభించారు. కలిసి పనిచేయడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ భేటీలో చర్చించి రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తుపై, అవగాహనకు రాబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సీఎంను కలిసిన తర్వాతే కలిసి పోయేదానిపై ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందాయి తప్పితే వారితో తమకు ఒరగబెట్టింది ఏమిలేదని కూనంనేని స్పష్టం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్తో ఇక మీదట పొత్తు ఉన్నా, లేకపోయినా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై సైతం దృష్టిసారించారు. కమిటీలను మరింత యాక్టీవ్ చేసి గ్రామస్థాయి నుంచి ప్రోగ్రాంలు నిర్వహించేందుకు ప్రణాళికలు ఇవ్వబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రెండుపార్టీలు కలిసిముందుకు పోతాయా? లేకుంటే ఒంటరిగానే ముందుకు సాగుతాయనేది తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read: Dialysis Centres: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!