మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వివాహేతర సంబంధం తండ్రి ప్రాణం తీసింది. కొడుకు ఓ వివాహితను తీసుకుని ఊరు నుండి పారిపోవడంతో ఆమె భర్త యువకుడి తండ్రిని హతమార్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడిపల్లి మల్లయ్యను అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య హత్య చేశాడు. మల్లయ్య కుమారుడు రాజశేఖర్ గత కొన్ని నెలల క్రితం భూమయ్య భార్యను ఇంటి నుండి తీసుకువెళ్లి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో భూమయ్య తన భార్య కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి రాజశేఖర్ తో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. కౌన్సిలింగ్ తర్వాత కూడా మహిళ భర్తతో ఉండేందుకు నిరాకరించింది. తిరిగి ప్రియుడుతో వెళ్లి పోయింది. దీంతో కక్ష పెంచుకున్న భూమయ్య రాజశేఖర్ కుటుంబాన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ తండ్రి మల్లయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామం సమీపంలో వాగు వద్దకు బహిర్బూమికి వెళ్లిన మల్లయ్యను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతుడిని చెరువులో పడేసి అక్కడ నుండి పారిపోయాడు. ఉదయం చెరువు వైపు వెళ్లిన స్థానికులు మల్లయ్య మృతదేహాన్ని చూసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూమయ్యని మల్లయ్య హతమార్చాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమారుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ రవీందర్ తెలిపారు. ఈ ఘటన చెన్నూరు పట్టణంలో కలకలం రేపింది.