CV Anand Telangana DGP: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మే 2న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం ఏసీబీ డీజీగా కొనసాగుతుండగా.. తాజా నియామకంతో రాష్ట్ర పోలీస్ దళానికి సారథ్యం వహించనున్నారు.
హైదరాబాద్ నగరానికే చెందిన సీవీ ఆనంద్.. పాతబస్తీలోని పెట్లబుర్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత సి. దామోదర్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా పనిచేశారు. విద్యారణ్య హైస్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్)లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆనంద్.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చదువుతో పాటు అండర్-19 జట్టు తరఫున క్రికెట్ ఆడి జాతీయ స్థాయిలో రాణించారు.
కెరీర్ విషయానికి వస్తే సీవీ ఆనంద్ అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాలంలో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. అలాగే సైబరాబాద్ సీపీగా పనిచేసినప్పుడు సాంకేతికతను జోడించి నేర నియంత్రణకు కృషి చేశారు. ఏసీబీ డీజీగా అవినీతి నిరోధక శాఖలో సమూల మార్పులు తెచ్చారు. గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన విజయవంతమయ్యారు. కేంద్ర సర్వీసుల్లో సీఐఎస్ఎఫ్ (CISF) ఐజీగా కూడా ఆయన సేవలందించారు.
నిబద్ధత కలిగిన అధికారిగా సీవీ ఆనంద్ పలు గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2002లో ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్, 2017లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ (PPM) వంటివి ఆయన ప్రతిభకు నిదర్శనం. ఫిట్నెస్ పట్ల అత్యంత శ్రద్ధ వహించే ఆయన.. ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన కుమారుడు మిలింద్ ఆనంద్ ప్రొఫెషనల్ క్రికెటర్ కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ సీనియర్ టీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. డీజీపీగా సీవీ ఆనంద్ నియామకంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Also: పేదలెవరూ ఇళ్ల స్థలాలు అమ్ముకోవద్దు.. రెండేళ్లు ఆగితే జగన్ వస్తాడు: పేర్ని నాని