విశాఖపట్నం ఐటీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గూగుల్ సంస్థ భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (FDI) విశాఖకు తీసుకువచ్చింది. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశాఖ ఇకపై ఉక్కు నగరం మాత్రమే కాదని డేటా సిటీగా ప్రపంచ చిత్రపటంలో నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారంతో ఏర్పాటవుతున్న ఈ డేటా సెంటర్ ఏపీ అభివృద్ధి గమనాన్ని మార్చబోతోంది.
ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు అలాగే సహకరించిన యువతకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం వల్లే గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని లోకేశ్ వివరించారు. దేశంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభావంతో రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమవుతోందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశం మొత్తంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. గతంలో సైబరాబాద్ నిర్మాణాన్ని ఏ విధంగా చూశామో ఇప్పుడు విశాఖ ఏఐ హబ్ ద్వారా అటువంటి మార్పునే చూడబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెకానికల్ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని వివరించారు.
ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన అని మంత్రి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే విధానానికి తాము కట్టుబడి ఉన్నామని లోకేశ్ పునరుద్ఘాటించారు. కేవలం ఒకే చోట కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆయా రంగాలకు అనుగుణంగా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం వికాసం వైపు నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ప్రాంతాన్ని మొదటి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్గా మార్చడమే లక్ష్యమని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం పెట్టుబడిదారులను భయపెట్టిందని విమర్శిస్తూ.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై నమ్మకంతో గూగుల్ ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. వైజాగ్లో ఇకపై G అంటే గూగుల్ అని లోకేశ్ అభివర్ణించారు. ఏపీలో విధానపరమైన స్పష్టత, నిర్ణయాల్లో వేగం ఉంటుందని పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. నవ భారతం వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో గూగుల్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ALSO READ: మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్