Drunk and Drive Cases: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా.. ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 424 మందిని అదుపులోకి తీసుకొని.. కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో అధిక సంఖ్యలో ద్విచక్రవాహనదారులే ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
300 మంది – బైక్ రైడర్లు
18 – ఆటో డ్రైవర్లు
99 – కారు డ్రైవర్లు
7 – హెవీ వాహనాలు నడిపిన డ్రైవర్లు
ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అధిక శాతం మంది మద్యం సేవించి వాహనాలు నడపడం గమనించారని తెలిపారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) ఆధారంగా కేసులు మూడు వర్గాల్లో నమోదు చేశారు.
BAC ఆధారంగా పట్టుబడిన వారి వివరాలు
361 మంది – 35 mg/100 ml నుంచి 200 mg/100 ml
43 మంది – 201 mg/100 ml నుంచి 300 mg/100 ml
20 మంది – 301 mg/100 ml నుంచి 550 mg/100 ml
70 mg/100 ml BAC ను దాటితే అది శిక్షార్హమైన నేరం. కానీ కొందరు 300 mg పైగా కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
పట్టుబడిన వారిని పత్రాల సమన్వయం పూర్తి చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు విచారణ ఆధారంగా జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.
గత వారం (17.11.2025–22.11.2025)లో మొత్తం 358 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి.
వీరిలో 304 మందికి — కేవలం జరిమానా
22 మందికి — జరిమానాతో పాటు సోషల్ సర్వీస్
32 మందికి — జరిమానా + జైలు శిక్ష విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
సమాజానికి మద్యం సేవించి డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో అవగాహన కలిగించేందుకే సోషల్ సర్వీసు శిక్షలు వినియోగిస్తున్నారని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
Also Read: కార్ పార్కింగ్ కొట్లాట.. పగిలిన తలలు.. పోలీసులు లాఠీఛార్జ్
ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ రోజుల్లో తనిఖీలు పెంచనున్నట్లు స్పష్టంచేశారు. రాత్రి ఆలస్యంగా కూడా తనిఖీలు కొనసాగిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపడం కొట్టిపారేయలేని నేరమని గుర్తుచేశారు. ప్రజలు తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.