MLA Medipalli Satyam: జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం, పూడూరు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కి పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే సత్యం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం కరీంనగర్ నుండి కాన్వాయ్తో వెళుతుండగా.. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కార్లు ఎదురుగా రావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా కొండగట్టు వైపు పయనిస్తోంది. అదే సమయంలో.. జగిత్యాల వైపు నుండి హైదరాబాద్కు వెళ్తున్న మూడు ప్రైవేట్ కార్లు ఒకదాని వెనుక ఒకటిగా కాన్వాయ్కు ఎదురుగా వచ్చాయి. పూడూరు గ్రామ శివారులో మలుపు వద్ద అదుపు తప్పిన కాన్వాయ్లోని ఒక కారు.. ఎదురుగా వస్తున్న మొదటి కారును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు ఒకదానికొకటి తాకాయి.
అదే సమయంలో, ఎమ్మెల్యే సత్యం గారి కారు వెనుక వస్తున్న కాన్వాయ్లోని మరో రెండు కార్లు కూడా ఆగి ఉన్న కార్లను వెనుక నుండి ఢీకొట్టాయి. మొత్తం ఐదు కార్లకు (ఎమ్మెల్యే కాన్వాయ్లోని 3 కార్లు, ప్రైవేట్ వ్యక్తుల 2 కార్లు) ప్రమాదం జరిగి, ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణిస్తున్న కారుకు ముందు, వెనుక ఉన్న కార్లకు కొంచె డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యే సత్యం గారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కాన్వాయ్లోని పలువురు వ్యక్తులకు, అలాగే ప్రైవేట్ కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం కారణంగా కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కొడిమ్యాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన కార్లను రహదారి నుండి తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ALSO READ: IAF: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో 340 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్