Hyderabad H-FAST raid: హైదరాబాద్ లో ఇటీవల కల్తీ మాఫియా గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం నగరవాసులను వణికిస్తోంది. మనం రోజూ తాగే టీ పొడి దగ్గర నుండి వంట నూనెలు, కారం, పసుపు, చివరకు ఐస్క్రీమ్ల వరకు ప్రతిదీ కల్తీమయం అవుతోంది. ముఖ్యంగా హోటళ్లు, తోపుడు బండ్ల వద్ద లభించే ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో, కల్తీని మూలాల నుండి ఏరివేసేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని రంగంలోకి దింపింది. కల్తీ టీ పొడి మాఫియాపై తాజాగా జరిగిన దాడుల వివరాలను డిసిపి వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా కల్తీ టీ పొడి గోదాంల పైన హెచ్-ఫాస్ట్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో సుమారు 3000 కేజీల కల్తీ టీ పొడి, 1500 కేజీల ఎక్స్పైరీ (గడువు ముగిసిన) టీ పొడితో పాటు, వీటికి రంగు కలిపేందుకు వాడే ప్రమాదకరమైన కెమికల్ రంగులను పోలీసులు సీజ్ చేశారు. ఈ భారీ రాకెట్ను ఛేదించి పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డిసిపి వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఈ కల్తీ మెటీరియల్ అంతా అస్సాం, కలకత్తా, కేరళ రాష్ట్రాల నుండి హైదరాబాద్కు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కల్తీ టీ పొడి వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని డిసిపి హెచ్చరించారు. తక్కువ నాణ్యత గల టీ పొడికి సింథటిక్ రంగులు కలపడం వల్ల అది చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ, అది శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లోనే ఈ కల్తీ మాఫియా తమ కార్యకలాపాలను సాగిస్తోందని ఆయన వివరించారు.
కల్తీని అరికట్టే విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని డిసిపి స్పష్టం చేశారు. నిందితులపై కేవలం ఫుడ్ సేఫ్టీ యాక్ట్ మాత్రమే కాకుండా, భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఒకసారి పట్టుబడిన తర్వాత మళ్లీ అదే నేరానికి పాల్పడితే (రెండోసారి దొరికితే), అటువంటి వారిపై పీడీ యాక్ట్ (Prevantive Detention Act) నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, అటువంటి వ్యాపార సంస్థలను, షాపులను శాశ్వతంగా సీజ్ చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నలుమూలల హెచ్-ఫాస్ట్ తన నిఘా నేత్రాన్ని పెంచిందని, గత నెల రోజుల్లోనే అనేక సోదాలు నిర్వహించి భారీగా కల్తీ మెటీరియల్ను అడ్డుకున్నామని డిసిపి వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Also: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!