సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెలకు ఉన్న ప్రాముఖ్యతను గురించి చెప్పారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అధికారిక క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబరు నెలలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడటం, సోనియా గాంధీ జన్మదినం ఉండటం పార్టీకి ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన త్యాగం వల్లే నేడు రాష్ట్రంలో స్వేచ్ఛగా వేడుకలు జరుపుకోగలుగుతున్నామని ఆయన కొనియాడారు.
యేసు ప్రభువు బోధించిన శాంతి, ప్రేమ మార్గంలోనే తమ ప్రభుత్వం నడుస్తోందని సీఎం స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్ పథకం ద్వారా దాదాపు 50 లక్షల పేదల ఇళ్లలో వెలుగులు నింపామని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ గత రెండేళ్లలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్లు వెల్లడించారు.
దేశాభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీల పాత్రను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వాతంత్ర్య సమయంలో 32 ఏళ్లుగా ఉన్న మనిషి సగటు జీవన ప్రమాణం నేడు 72 ఏళ్లకు పెరిగిందంటే, ప్రభుత్వాలతో సమానంగా మిషనరీలు అందించిన విద్య, వైద్య సేవలే కారణమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ద్వేషించే వారిని సైతం ప్రేమించాలన్న యేసు సందేశాన్ని అందరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇతర మతాలను కించపరిచేలా వ్యవహరిస్తే సహించేది లేదని, విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ (Hate Rate) చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు.
క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 7 వేల చర్చిలకు క్రిస్మస్ వేడుకల కోసం ప్రభుత్వం 33 కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు. ఒక్కో చర్చికి 30 వేల రూపాయల చొప్పున అందజేసినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ALSO READ: CM Revanth Reddy: 24 నెలల్లో 240 కీలక నిర్ణయాలు.. సీఎం రేవంత్ మార్క్..