Decreasing Unemployment In Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులతో పాటు నియామకాల్లో అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు ఆందోళన చెందేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఉద్యమాలు, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారు. 2014లో సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణకు అనుమతి ఇవ్వగా… ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
ఈ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా తాను ఆ మాటే అనలేదని ఇంటికో ఉద్యోగం అసలు సాధ్యమయ్యే ముచ్చట కాదని మాట మార్చారు. కేసీఆర్ మాటలతో నిరుద్యోగుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. 2014 నుండి 2018 వరకు ఉద్యోగ నియామకాల కోసం వేచి చూసి నిరుద్యోగులు నిరాశ చెందారు. అయినప్పటికీ 2018లో మరోసారి టీఆర్ఎస్ కు అధికారమిచ్చి ఉద్యోగాల కోసం ఎదురుచూశారు.
అయినప్పటికీ ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు. పదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షను నిర్వహించకుండా అసమర్ద పాలనతో బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోయింది. పక్క రాష్ట్రాల్లో మూడు నాలుగు డీఎస్సీలు నిర్వహిస్తే తెలంగాణలో కేవలం ఒకే ఒక్క డీఎస్సీ నిర్వహించారు. మరోవైపు పేపర్ లీకేజీలు నిరుద్యోగులను తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను గద్దె దింపాలని నిరుద్యోగులు నిర్ణయించుకున్నారు.
తన కుటుంబంలోని వ్యక్తులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోకపోవడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దింపి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీలు ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. ఎన్నికల్లో ముందుండి నడిపించి కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చారు. అధికారంలో వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు ఎలాంటి అవకతవకలు జరగకుండా వీలైనంత త్వరగా జాయినింగ్ లెటర్లు ఇచ్చింది.
మరోవైపు ప్రైవేట్ సెక్టార్ లోను ఉద్యోగ అవకాశాలు పెంచుతోంది. తాజాగా వచ్చిన ఓ నివేదిక ప్రకారం ఆరు నెలలోనే రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. చదువుకుంటున్న 15 నుండి 29 ఏళ్ల యువతలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్టు నివేదిక చెబుతోంది. గత ఏడాది జూలై సెప్టెంబర్ తో పోలిస్తే నిరుద్యోగ రేటు 22. 9శాతం నుండి 18.1 శాతానికి తగ్గినట్టు జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెళ్లడైంది. ఆరు నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో యువతకు ఉపాధికి లభిస్తోందని నివేదిక పేర్కొంది.
అన్ని వయసుల వారిని పరిగణంలోకి తీసుకుంటే ఉద్యోగ రేటు 6.6% ఉందని నివేదిక పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు నిరుద్యోగ రేటులో కేరళ 10.1%తో ముందు వరుసలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 7.3%తో రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణ 10వ స్థానంలో ఉంది. ప్రజాప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఇదే విధంగా పాలనకొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది.