Delhi High Court: తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురి పెళ్లి ఖర్చుకు సంబంధించిన వివాదంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రజత్ కుమార్ కూతురి పెళ్లి విలాసవంతమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ తోపాటు పలు ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లలో అయిదు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఖర్చులు అన్నింటినీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. తన షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిపిందంటూ నారాయణ పేట్ కు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ గతంలో డీవోపీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.
దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నాలుగేళ్లుగా కేసు విచారణలో పురోగతి లేకపోవటంపై అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ ప్రాజెక్టును పర్యవేక్షించే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ విభాగానికి చీఫ్ గా పని చేశారు. ఆ సమయంలోనే రజత్ కుమార్ కూతురి వివాహం 5 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.
Also Read: Viral Video: కంత్రి దొంగ.. సూట్లో గెస్టుగా వచ్చి.. నీటుగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు!
తాజ్ ఫలక్ నుమా, తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్ హోటళ్లలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అతిథులకు ఈ స్టార్ హోటళ్లలోనే బస కల్పించారు. తాజ్ ఫలక్ నుమాలో అప్పట్లో రజత్ కుమార్ ఓ విందు కూడా ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు 16వేల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టుగా ప్రచారం జరిగింది. కాగా, ఈ వేడుకలకు అయిన ఖర్చులు అన్నింటినీ మేఘా కంపెనీ షెల్ కంపెనీల ద్వారా చెల్లించినట్టుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ లు కంపెనీ మెయిల్ ఐడీలతోపాటు కొన్ని డమ్మీ ఐడీలను ఉపయోగించి ఈవెంట్లను సమన్వయం చేసినట్టుగా ప్రచారం జరిగింది. తొలుత ఫేక్ ఐడీలు వాడినా ఆ తరువాత తమ అధికారిక మెయిల్ ఐడీలను వినియోగించినట్టుగా వార్తలొచ్చాయి.
Also Read: Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్కు.. రెండింటిలో ఏది బెస్ట్?