CBI Summons K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు నేరుగా ఆమెకు ఈ నోటీసులు అందజేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబులకు కూడా అధికారులు ఈ సమన్లను అందించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో ఈ కేసును విచారించిన రౌజ్ అవెన్యూ కోర్టు నిందితులందరికీ క్లీన్ చీట్ ఇస్తూ చార్జిషీట్ను కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాలు సరిపోవని అభిప్రాయపడుతూ నిందితులపై అభియోగాలు నమోదు చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా దర్యాప్తు అధికారి తీరుపై కూడా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విచారణకు ఆదేశించింది. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తిస్థాయి విచారణ అవసరమని సీబీఐ వాదించడంతో హైకోర్టు స్పందించి నిందితులకు సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్ వచ్చిన సీబీఐ బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కవిత నివాసానికి చేరుకుంది. సుమారు అరగంట పాటు ఆమెతో మాట్లాడి హైకోర్టు సమన్లను అందజేసి సంతకం తీసుకున్నారు. ఈ సందర్భంగా కవిత స్పందిస్తూ సత్యం తన తోడుగా ఉంటుందని అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని ప్రకటించారు. గతంలోనే రౌజ్ అవెన్యూ కోర్టు కేసును కొట్టేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాలపై తమ లీగల్ టీమ్తో చర్చిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
చట్టపరంగా ఈ సమన్లు కేవలం సమాచారం కోసమేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటిసారి విచారణ జరుగుతున్నందున కవిత వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఆమె తరపు న్యాయవాదులు హాజరయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఆధారాలన్నీ నిరాధారమని గతంలోనే నిరూపితమైందని కవిత తరపు కౌన్సిల్ వాదిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నెల 16న హైకోర్టులో జరిగే విచారణ ఆధారంగా తదుపరి అడుగులు పడనున్నాయి.
Read Also: KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?