Telangana Municipal Elections 2026: తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందించారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో సాగుతున్న ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం నేడు ఘనమైన ఆదరణగా మారిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం సమష్టిగా పనిచేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక రంగాల్లో సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఈ భారీ విజయం ప్రభుత్వ పారదర్శక పరిపాలనకు, అభివృద్ధి కార్యాచరణకు లభించిన గౌరవంగా ఆయన భావిస్తున్నారు.
కార్యకర్తల నిరంతర శ్రమ, ప్రజల అభివృద్ధి కాంక్ష ఈ గెలుపుకు పునాదులని డిప్యూటీ సీఎం కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైన ఈ ఆదరణ భవిష్యత్తులో రాబోయే మరిన్ని మార్పులకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో, కట్టుబాటుతో పనిచేస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నేడు వెలువడుతున్న ఫలితాల ప్రకారం, మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 60 స్థానాల్లో విజయం సాధించి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీల్లో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. సుమారు 34 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. వార్డుల పరంగా చూస్తే, మొత్తం 2,582 వార్డులలో కాంగ్రెస్ సగం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని తన పట్టును నిరూపించుకుంది. ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.