Udaan Program: తెలంగాణ యువతను నూతన సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్ది, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ‘డెల్ టెక్నాలజీస్’ కలిసి పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ‘ఉడాన్’ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇరు వర్గాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సచివాలయంలో శనివారం మంత్రి డి.శ్రీధర్ బాబు నాయకత్వంలో నిర్వహించిన సమావేశంలో ఎంఓయూ కుదిరింది.
మంత్రి మాట్లాడుతూ ఉడాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే 25 శిక్షణా కేంద్రాలతో 5,500 మంది విద్యార్థులకు 3 నెలల పాటు ప్రత్యేకానుభవంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, నూతన సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక అవగాహన, ఉద్యోగార్హత ప్రతిభ పెంచేలా ఈ శిక్షణ సాగనుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు సైతం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
విద్య, నైపుణ్య శిక్షణ,పారిశ్రామిక అవగాహన,ఉపాధి, అప్రెంటిస్షిప్, పారిశ్రామికవేత్తగా రాణించడం ఉడాన్ లక్ష్యమన్నారు. డిగ్రీలు పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, చదువుకుంటున్న సమయంలోనే పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా యువతకు ఉద్యోగాలు, అప్రెంటిస్షిప్లు లేదా స్వయం ఉపాధి దిశగా మార్గం సుగమం చేయడం జరుగుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలఆధారంగా, డెల్ టెక్నాలజీస్ సాంకేతిక సహకారంతో ఈ శిక్షణ సాగుతుందన్నారు.
Also read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?
జాతీయ స్థాయిలో డెల్ టెక్నాలజీస్, ఎఫ్.ఐ.టీ.టీ–ఐఐటీ ఢిల్లీ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, జనరేషన్ ఇండియా ఫౌండేషన్లు కలిసి ఉడాన్ ద్వారా యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నాయన్నారు. కేవలం శిక్షణ సంఖ్యకే పరిమితం కాకుండా, యువతకు స్పష్టమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమర్థవంతమైన స్కిల్లింగ్ వ్యవస్థను నిర్మించాలనే టాస్క్ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.
ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ రామ్, టాస్క్ సీఈఓ నితిన్ కుమార్ రెడ్డి, సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సీఓఓ నిఖిల్, డెల్ టెక్నాలజీస్ గవర్నమెంట్ సీనియర్ అకౌంట్ మేనేజర్ కె.కృష్ణ కిషోర్, డెల్ టెక్నాలజీస్ ఏపీజేసీ రీజినల్ సీఐఓ,హైదరాబాద్ సైట్ డైరెక్టర్ రమేష్ జంపుల తదితరులు పాల్గొన్నారు.
Also read: ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?.