Dharmavani Program: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డైరెక్టర్ శ్రీ హనుమంతరావు ‘ధర్మవాణి’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా శాఖలోని ఉద్యోగులు, అర్చకులు ,ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుంది.
ఎండోమెంట్స్ కమిషనర్ , డైరెక్టర్ శ్రీ హనుమంతరావు ఆదేశాల మేరకు, ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్లోని డైరెక్టర్ కార్యాలయంలో బాధితులు తమ విన్నపాలను అందజేయవచ్చు. ఎవరైనా సరే మధ్యవర్తులు లేకుండా నేరుగా డైరెక్టర్ గారిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
‘ధర్మవాణి’కి వచ్చే దరఖాస్తులను పరిశీలించి అవి ధర్మబద్ధంగా ఉంటే తక్షణమే లేదా గరిష్టంగా వారం రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారు. కేవలం ప్రధాన కార్యాలయ సమస్యలే కాకుండా డిప్యూటీ కమిషనర్ (DC), అసిస్టెంట్ కమిషనర్ (AC),ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) కార్యాలయాల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ వేదిక ద్వారా పరిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఒక దరఖాస్తుపై తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత వ్యక్తులకు కార్యాలయం నుండి ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందిస్తారు. ఒకవేళ సాంకేతిక లేదా చట్టపరమైన కారణాల వల్ల ఏదైనా సమస్యను పరిష్కరించలేకపోతే, దానికి గల కారణాలను కూడా దరఖాస్తు దారునికి వివరంగా వివరిస్తారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
దేవాదాయ శాఖలోని ఉద్యోగులు, అర్చకులు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఈ ‘ధర్మవాణి’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ కోరారు. ఇది కేవలం ఫిర్యాదుల విభాగం మాత్రమే కాకుండా శాఖలో జవాబుదారీతనాన్ని పెంచే ఒక చక్కని వేదికగా నిలవనుంది.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ 5 ఆదివారాలు మిస్ అయితే భారీ నష్టం!