Telangana Politics: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు బీజేపీ జై కొట్టడం వెనుక ఏం జరిగింది? ఓ వైపు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూనే, మరోవైపు సపోర్టు చేయడం వెనుక కారణమేంటి? దీని వెనుక బీఆర్ఎస్ రాజకీయ కాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి బీజేపీ జై
తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. కాదు కాంగ్రెస్-బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ అంటోంది. తాజాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చుట్టూ కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ని అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది రేవంత సర్కార్.
తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద పెట్టుబడుల కార్యక్రమం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రధానిని స్వయంగా ఆహ్వానించింది రేవంత్ సర్కార్. వీరితోపాటు దేశీయ, విదేశీ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
జాతీయ పార్టీల రాజకీయాలను గమనిస్తున్న బీఆర్ఎస్
నార్మల్గా అధికార పార్టీ చేసే ఏపనైనా విపక్షాలు విమర్శించడం సహజం. ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీజేపీ.. గ్లోబల్ సమ్మిట్కు జై కొట్టడం బీఆర్ఎస్ నేతలకు మింగుడుపడడం లేదు. ఇక్కడే రకరకాల చర్చలు లేకపోలేదు. రేవంత్ సర్కార్ చేపట్టిన కార్యక్రమానికి బీజేపీ ఎందుకు సపోర్టు చేసిందనే దానిపై ఓపెన్గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.
రాజకీయం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని, అభివృద్ధి వేరన్నది కమలనాథుల మాట. అధికారంలో ఉన్నది రాజకీయ ప్రత్యర్థి అయినా, పెట్టుబడులను రాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం అన్నది తమ ఉద్దేశం కాదని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని అంటున్నారు.
ALSO READ: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు. కేందమంత్రి కిషన్ రెడ్డి హాజరుకావడం వెనుక ఉద్దేశం ఇదేనన్నది ఆయన మాట. రేపటి రోజున కేంద్రాన్ని వేలెత్తకుండా చూపకూడదన్నది బీజేపీ ఆలోచన. తాము వివక్ష చూపలేదని చెప్పడానికి ఇదే కారణమని అంటున్నారు.
కాంగ్రెస్-బీజేపీల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారాలను బీఆర్ఎస్ పెద్దలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి తమను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని కారు పార్టీలో కొందరు నేతల మాట. ఒకవిధంగా చెప్పాలంటే తమను కార్నర్ చేశారని అంటున్నారు. ఈ సమ్మిట్పై అటు కేసీఆర్ ఆరా తీసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ పెద్దలు.