Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ జరుగుతోంది? ఎందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గురించి చర్చ జరుగుతోంది? కేడర్, నేతలను ఆయన పట్టించుకోవడం లేదా? కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఆయన పని తీరుపై అసంతృప్తి మొదలైందా? డిజాస్టర్ అధ్యక్షుడిగా ఆయన మిగిలిపోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. డిజాస్టర్ ప్రెసిడెంట్
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ ఇచ్చి దాదాపు దశాబ్దం తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కీలకమైన రాష్ట్రం కూడా. అందుకే తెలంగాణలో ఏం జరుగుతుందోనని నిత్యం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓ కన్నేసి ఉంచుతారు.
అక్కడ జరుగుతున్న యాక్టివిటీని నిత్యం గమనిస్తుంటారు. తేడా వస్తే నేతలను ఢిల్లీకి పిలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి కీలకమైన తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు మహేష్కుమార్ పని తీరుపై అప్పుడు పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆయన టీపీసీసీగా బాధ్యతలు చేపట్టి దాదాపు 20 నెలలు పూర్తి కావస్తోంది.
ఆయన కాలంలో పార్టీ కేడర్, నేతలను పట్టించుకున్న సందర్భాలు లేవన్నది బహిరంగంగా కొందరు నేతలు చెబుతున్నారు. 33 జిల్లాలకు అధ్యక్షుడైన మహేష్ కుమార్, ఆయన కాలంలో జిల్లాల టూర్లకు వెళ్లిందని చాలా తక్కువని చెబుతున్నారు. మహా అయితే ఐదు లోపు ఉండవచ్చని నేతల మాట. ఎంతసేపు హైదరాబాద్, లేకుంటే విదేశాల్లో ఉంటారని ఆయన్ని దగ్గరగా గమనిస్తున్న నేతల మాట.
వేగుల ద్వారా సమాచారం సేకరించిన కాంగ్రెస్ హైకమాండ్
వీలైతే మీడియా సమావేశాలు, లేకుంటే ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు తప్పితే ఇంకేమీ చేయలేదనే చర్చ అప్పుడే పార్టీలో మొదలైంది. ఆయన ఏం చేసినా నామ్ కే వాస్త్గా ఉంటోందని మీడియా ఛానెళ్లలో చర్చలు లేకపోలేదు. చివరకు గాంధీభవన్కు ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదని అక్కడి వచ్చిన నేతలు మాట్లాడుకుంటున్నారు.
సార్ ఎక్కడంటూ సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నాయకులు-ఎమ్మెల్యేలకు అనుసంధాన కర్తగా ఉండాల్సిన ఆయన, ఏ మాత్రం పట్టించుకోరనే వాదన బలపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లలేదని వాదన ఆయనపై ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన తీరు పీసీసీలో చిన్నపాటి తుపాను మొదలైనట్టు తెలుస్తోంది.
ALSO READ: వచ్చే నెలలో తెలంగాణకు.. మరో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక..!
దేవాలయంలా చూసుకోవాల్సిన పార్టీ ఆఫీసు గాంధీ భవన్ను మహేశ్ కుమార్ గాలికి వదిలేశారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గాంధీ భవన్ పరిస్థితి అధ్వానంగా మారిందని, ప్రాంగణంలో బీరు సీసాలు, మద్యం బాటిళ్లు దర్శనం ఇస్తున్నాయని కేడర్ మండిపడుతోంది.
పార్టీ జెండాలు నేలపై ఉన్నా, పట్టించుకునే నాథుడు లేడంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. ఇప్పుటికే వేగుల ద్వారా అధిష్టానం సమాచారం తెచ్చుకున్నట్లు సమాచారం. రేపో మాపో ఆయనకు హస్తిన నుంచి పిలుపు రావచ్చని అంటున్నారు.