హైదరాబాద్ నగర శివార్లలో కబ్జాకోరుల గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. నార్సింగి చౌరస్తా సమీపంలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీలో కబ్జాకు గురైన సుమారు 3 వేల గజాల పార్కు స్థలాన్ని సోమవారం హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. సుమారు రూ. 60 కోట్ల విలువ చేసే ఈ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు, వెంటనే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ బోర్డులను పాతారు.
గండిపేట మండలం నార్సింగి విలేజ్లోని అరుణోదయ కాలనీ హుడా (HUDA) అనుమతి పొందిన లేఅవుట్. ఈ లేఅవుట్లో నిబంధనల ప్రకారం 6078 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే.. స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఖరీదైన భూమిపై కన్నేశారు. ఇప్పటికే సుమారు 3 వేల గజాల పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 3 వేల గజాల్లో కూడా 1600 గజాలను ఒక వ్యక్తి కబ్జా చేసి ప్రీకాస్ట్ ప్రహరీ గోడ నిర్మించి లోపల షెడ్లను వేశారు. గతంలో నార్సింగి మున్సిపాలిటీ అధికారులు వీటిని తొలగించినప్పటికీ, కబ్జాదారుల తీరు మారలేదు.
ఇటీవల నార్సింగి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుండటాన్ని అదనుగా తీసుకున్న సదరు వ్యక్తి, మళ్లీ ఆ 1600 గజాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక షెడ్లు నిర్మించారు. అధికారుల కళ్లు గప్పి భూమిని కాజేయాలన్న ప్రయత్నాన్ని గమనించిన స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు.
రెవెన్యూ మరియు మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా బృందం సోమవారం నార్సింగిలో పర్యటించింది. రికార్డులను పరిశీలించి, అది పార్కు స్థలమేనని నిర్ధారించుకున్నాక కఠిన చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీలను, షెడ్లను తొలగించి మొత్తం 3 వేల గజాల ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలు మళ్లీ జరగకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ‘పార్కు కోసం కేటాయించిన స్థలం’ అని స్పష్టం చేస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా చూపిస్తున్న తెగువపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Harish Rao: కేసీఆర్ రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ సున్నం పెట్టింది, హరీష్ రావు ధ్వజం