DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిపై అవగాహన, చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ పదేళ్లలో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పి చేయలేదని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో కూడా ఏమీ చేయలేదని, నిధులు ఇచ్చిందీ లేదని ఫైరయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి సొమ్ము నుంచి ఇవ్వడం లేదని, ప్రజల సొమ్ముతో ఇస్తున్నారని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని ధ్వజమెత్తారు.
తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్దులై పని చేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు చేసే ప్రతి పోరాటంలో తాము భాగస్వామ్యులు అవుతామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read: నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మైండ్ బ్లోయింగ్ సవాల్!