⦿ సైకిల్ ట్రాక్పై ఫేక్ ప్రచారం
⦿ తొలగిస్తున్నారనడంలో నిజం లేదు
⦿ కొత్త ర్యాంప్ నిర్మాణానికి 80 మీటర్లు మాత్రమే తొలగింపు
⦿ దుష్ప్రచారంపై హెచ్ఎండీఏ వివరణ
హైదరాబాద్, స్వేచ్ఛ: Hyderabad News: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని హెచ్ఎండీఏ స్పష్టం చేశారు. నానక్ రామ్ గూడా రోటరీ హెచ్ఎండీఏ వద్ద, దేవి ఆలయం వద్ద ర్యాంప్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నామని, 120 మీటర్ల పొడవుతో కొత్త రాంప్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైందని, ఈ కొత్త ర్యాంప్.. సైకిల్ ట్రాక్ మీదుగా దాటనుండడంతో 80 మీటర్ల సైకిల్ ట్రాక్ రూఫ్ తొలగించినట్టు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు.
కొత్త ర్యాంప్ నిర్మాణంపై ఆగస్టు 31, 2024 న జీహెచ్ఎంసీ 66 వ కన్వర్జేన్స్ మీటింగ్లో చర్చించినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల నుంచి నానక్ రామ్ గూడా రోటరీ మీదుగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నానక్ రామ్ గుడా రోటరీ మొత్తం స్తంభిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
గచ్చిబౌలి నుంచి నార్సింగి, మణికొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద వెళ్తున్నారని, ఈ కారణంగా నానక్ రామ్ గూడా రోటరీలో కాజాగూడ వైపు భారీ ట్రాఫిక్ జామ్కు కారణం అవుతోందని పరిస్థితిని అధికారులు వివరించారు. నానక్ రామ్ గూడా రోటరీ వద్ద దిగకుండా… నార్సింగి సర్వీస్ రోడ్ వైపు వెళ్లడానికి నానక్ రామ్ గూడా టోల్ ప్లాజా ముందు కొత్త డౌన్ ర్యాంప్ను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదించడం జరిగిందని అధికారులు వివరించారు.