Huzurabad News: ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, నాణ్యమైన విద్య అందరికీ అందేలా ‘కామన్ స్కూల్ సిస్టం’ అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) డిమాండ్ చేసింది. హుజూరాబాద్ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బండ శ్రీనివాస్ అధ్యక్షతన డీటీఎఫ్ మండల వార్షిక కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది.
Also Read: Thorrur Municipal: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు!
విద్యార్థుల భవిష్యత్తును దృష్టి
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పి. ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని, పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
అనంతరం డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కోరారు. హుజూరాబాద్ జోన్ కన్వీనర్ ఎస్. చక్రధర్ మాట్లాడుతూ.. హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) నుండి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ. శ్రీనివాస్, ఆడిట్ కమిటీ కన్వీనర్ యు. శంకర్, విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రత్నం, రాష్ట్ర కౌన్సిలర్ సదానందం, సీనియర్ నాయకులు సిహెచ్. మల్లేశం, బి. రమేష్ సహా 50 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also Read: Ukraine: ఉక్రెయిన్పై మరోసారి రష్యా దాడి.. 15 మంది మృతి, మరో ఏడుగురికి గాయాలు