Rohit Shetty: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై జరిపిన కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అయిదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిబ్రవరి 1, 2026 ఆదివారం తెల్లవారుజామున సుమారు 12:45 గంటల సమయంలో ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రోహిత్ శెట్టి నివాసం (శెట్టి టవర్) వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ సమయంలో రోహిత్ శెట్టి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, కానీ ఒక బుల్లెట్ భవనంలోని జిమ్ అద్దాన్ని తాకింది. దీంతో అర్థరాత్రి అక్కడ హై అలర్ట్ నెలకొంది.
Read also-OTT: ఓటీటీలో సరికొత్త సంచలనం.. ఇంకా పట్టాలెక్కని సినిమా హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!
ముంబై క్రైమ్ బ్రాంచ్, పూణే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పూణేలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ముంబైకి తరలించి విచారించగా, నలుగురిని అధికారికంగా అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.. అమన్ ఆనంద్ మరోటే (27), ఆదిత్య జ్ఞానేశ్వర్ గాయకి (19), సిద్ధార్థ్ దీపక్ యెన్పురే (20), సమర్థ్ శివశరణ్ పొమాజీ (18), స్వప్నిల్ బందు సకత్ (23). నిందితులను కోర్టులో హాజరుపరచగా, ఫిబ్రవరి 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.
ఈ కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున ఒక పోస్ట్ వెలుగులోకి వచ్చింది. “శుభమ్ లోంకర్, ఆర్జూ బిష్ణోయ్” అనే పేర్లతో వచ్చిన ఈ పోస్ట్లో తామే కాల్పులు జరిపినట్లు బాధ్యత ప్రకటించారు. “మేము రోహిత్ శెట్టిని మా పనుల్లో జోక్యం చేసుకోవద్దని చాలాసార్లు హెచ్చరించాం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, బుద్ధి మార్చుకోకపోతే తదుపరి బుల్లెట్లు నేరుగా గుండెల్లోకి వెళ్తాయి” అని అందులో పేర్కొన్నారు. నిందితులకు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శుభమ్ లోంకర్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుల తరపు న్యాయవాది మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఎటువంటి సంబంధం లేదని, వీరికి కాల్పుల గురించి అసలు ఏమీ తెలియదని కోర్టులో వాదించారు. నిందితులను కేవలం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశారని, విచారణకు సహకరిస్తారని పేర్కొన్నారు. రోహిత్ శెట్టికి గతంలో ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదని సమాచారం. ఆయన త్వరలో విడుదల కాబోయే ప్రాజెక్టుల కారణంగా లేదా మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా పుస్తకంపై సినిమా హక్కులు తీసుకోవడం వల్ల ఈ దాడి జరిగి ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ తర్వాత మరో ప్రముఖ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకోవడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది.