Manoj Gaur: SLBC టన్నెల్ నిర్మాణ పనులు చేపడుతోన్న జేపీ జేపీ ఇన్ఫ్రాటెక్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్.. మనోజ్ గౌర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
గృహ నిర్మాణాల పేరుతో ప్రజల వద్ద నుండి సేకరించిన రూ.12,000 కోట్ల.. నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరపణలు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, జేపీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో యమునా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 40 వేల మంది హోమ్ బయ్యర్ల నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది.
అయితే ఆ నిధులను గృహ నిర్మాణ పనుల కోసం వినియోగించకుండా, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL)కు చెందిన ఇతర అనుబంధ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో వేలాది మంది హోమ్ బయ్యర్లు తమ ఇళ్లు లేకుండా చిక్కుకుపోయారు. దాదాపు పదేళ్లుగా వారు కోర్టులు, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ ఆరోపణల మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో పాటు, సీబీఐ కూడా మనోజ్ గౌర్, జేపీ ఇన్ఫ్రాటెక్పై వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరుపుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే నోయిడా, ఢిల్లీలోని కార్యాలయాలు, నివాసాలు సోదా చేశారు. ఈ నేపథ్యంలో పలు కీలక పత్రాలు, హార్డ్డ్రైవ్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈడీ అధికారులు రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఛాన్స్, ఏం చేయాలంటే?
కాగా.. తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రాజెక్ట్ కూడా ఇదే కంపెనీ నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యాలు, సాంకేతిక లోపాలపై ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపధ్యంలో.. ఎండీ అరెస్ట్ ప్రాజెక్ట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనోజ్ గౌర్ అరెస్ట్తో ప్రాజెక్ట్ ఫండింగ్, కాంట్రాక్ట్ లావాదేవీలపై కూడా సమీక్ష జరిపే అవకాశాలు ఉన్నాయని సమాచారం.