Etela Rajender: బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరును తప్పుబడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగట్టారు.
ఖమ్మంలో పేదల ఇళ్లను డీసీఎంలతో సహా పంపి మరీ కూలగొడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్దలు వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. కేవలం పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ముఖ్యంగా కూకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణకు గురైనా చర్యలు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందలాది ఇళ్లను ఖాళీ చేయించడాన్ని, కూల్చివేయడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, డైట్ చార్జీల వంటి నిత్యావసర ఖర్చులకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. 5 వేల కోట్లతో గాంధీ పార్క్ కడతామనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ నిర్మించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, పేదలకు ఇళ్లు ఇవ్వకపోగా ఉన్న ఇళ్లను పీకేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ‘దుర్మార్గాలను’ రాహుల్ గాంధీ వెంటనే గమనించి అడ్డుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డీపీఆర్ (DPR)లో ఎక్కడా ఇళ్లు కూలుస్తామని చెప్పకుండానే.. క్షేత్రస్థాయిలో పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న ఈ పరిస్థితులన్నింటినీ పూర్తి సమాచారంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు.
Also Read: జగ్గారెడ్డి మార్క్ రాజకీయం.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ.. ఆ ఇద్దరి కోసమేనా?