Jaggareddy: తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల కోసం సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ పేర్లను జగ్గారెడ్డి గారు బలంగా ప్రతిపాదించారు. ఈ విషయంలో ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు , రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీలతో మాట్లాడారు. తమ ప్రతిపాదనను జాతీయ నాయకత్వానికి వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు.
రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా బిజీగా ఉండటంతో.. జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల పేర్లను పరిశీలించాలని ఆయన కోరారు.
జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ , స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు అవకాశం కల్పించాలని కోరారు. కుసుమ కుమార్ కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం ఉన్నదని.. దశాబ్దాలుగా వారి కుటుంబం కాంగ్రెస్కే అంకితమై ఉందని గుర్తుచేశారు.
వి. హనుమంతరావు తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండ నాయకుడు. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని.. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ హయాంలో మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారని తెలిపారు. వయసు పైబడినప్పటికీ, నేటికీ ఎంతో చురుకుగా పనిచేసే ఆయనకు గౌరవపూర్వకంగా మరో అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు.
జగ్గారెడ్డి విన్నపాన్ని సావధానంగా విన్న మల్లికార్జున ఖర్గే, ఈ అంశాన్ని పార్టీ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగుతుందని.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. సామాజిక సమీకరణాలు , సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: హుజూరాబాద్లో లారీ బీభత్సం.. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో.. దుకాణాల్లోకి దూసుకెళ్లి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలపై చర్చ
Congress Working President Jaggareddy met AICC President Mallikarjun Kharge.
They discussed the latest… pic.twitter.com/o9PYBYnPQL
— BIG TV Breaking News (@bigtvtelugu) February 26, 2026